Congress MLA : ఆదివారం ఉదయం 10 గంటలకు హనుమకొండకు రా.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌వాల్‌

కాంగ్రెస్ నేత‌, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

Update: 2024-09-27 14:25 GMT

కాంగ్రెస్ నేత‌, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే ఆదివారం ఉదయం 10 గంటలకు హనుమకొండ నయీమ్ నగర్ నాలా బ్రిడ్జి మీదకు కేటీఆర్ రావాలని.. ప్రజలు ఎవరి మీద పూల వర్షం కురిపిస్తారో.. ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుందని స‌వాల్ విసిరారు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం తగదన్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే నీ కుటుంబ చరిత్ర మాట్లాడాల్సి వస్తుందన్నారు. నాలా పనులు ప్రారంభించి కూల్చిన వద్ద నుండి పూర్తి అయ్యే వరకు అక్కడ నిలబడి పని చేయించాను.. అది చూసిన జనం సన్మానం చేసారని పేర్కొన్నారు.

కేటీఆర్ రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్నావు.. వాడు వీడు అని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. వరంగల్ ఇప్పుడు కబ్జాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ కబ్జా భూమిలో ఉంద‌న్నారు. మీ శిష్యుడు భూములు కబ్జాలు లేక విలవిలలాడుతున్నాడని విన‌య్ భాస్క‌ర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వరంగల్ కు వాడ్రా వస్తుంది అనగానే మతి భ్ర‌మించినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

కాళోజి పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటు.. కాళోజీ కళాక్షేత్రం పనులు పిల్లర్లు, గోడలు తప్ప ఏమి చేయలేదన్నారు. మొత్తం పని పూర్తి చేసి మహనీయుని పేరుమీద జాతికి అంకితం చేస్తున్నాం.. అందులో తప్పు ఏమి ఉన్నది కేటీఆర్ అని ప్ర‌శ్నించారు. కేటీఆర్ ఆదివారం హన్మకొండకు వచ్చి క్షమాపణ చెప్పాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News