Greater Hyderabad : ఆ బ‌లంతోనే 'గ్రేటర్ పీఠం'పై కాంగ్రెస్ కన్ను

గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్‌లో పరాజయం పాలైన తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల తాజా ఫిరాయింపులు బ‌లాన్ని ఇచ్చాయి.

By :  Eha Tv
Update: 2024-07-14 08:36 GMT

గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్‌లో పరాజయం పాలైన తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల తాజా ఫిరాయింపులు బ‌లాన్ని ఇచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. గత రెండు వారాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆక‌ర్షించ‌డంలో విజయం సాధించింది.

ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలను లాక్కున్న కాంగ్రెస్.. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి జరగనున్న ఎన్నికలలో గెలిచి రాజ‌ధానిలో పాగా వేసేందుకు పక్కా ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు పట్టు అవసరమని.. ఆపరేషన్ ఆక‌ర్ష్‌తో అదీ సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

BRS నుండి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌.. గ్రామీణ తెలంగాణలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే 24 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ గ్రేటర్ హైదరాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

బీఆర్ఎస్‌కు బలమైన స్థానాల్లో భారీ ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో BRS తన పట్టును కాపాడుకుంది. ఏకంగా 16 స్థానాలను గెలుచుకుంది.. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తన ఏడు స్థానాలను నిలుపుకుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఏకైక సీటును నిలబెట్టుకుంది.

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నగరంతోపాటు చుట్టుపక్కల ఐటీ రంగం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రభుత్వ మార్పు.. వ్యాపార వాతావరణం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపుతుందని ఓటర్లు భావించి ఉండవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.

2018 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ రెండు స్థానాలను (మహేశ్వరం, ఎల్‌బి నగర్) గెలుచుకుంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. కేబినెట్ బెర్త్ లభించిన సబితా ఇంద్రారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో మహేశ్వరం స్థానాన్ని నిలబెట్టుకోగా.. డి. సుధీర్ రెడ్డి ఎల్‌బి నగర్ నుండి తిరిగి ఎన్నికయ్యారు. 2019లో బీఆర్‌ఎస్‌కు ఫిరాయించిన డజనుకు పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వీరు కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వ‌చ్చింది. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వేటాడటంలో అధికార పార్టీ విజయం సాధించింది.. మరికొంత మంది ఎమ్మెల్యేలను వేటాడేందుకు వేచి చూస్తున్నారని సమాచారం.

119 స్థానాలున్న అసెంబ్లీలో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ తన సంఖ్యను 74కి మెరుగుపరుచుకుంది. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం కూడా ఉంది.

మార్చిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ల‌తో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రారంభించింది. మే 13న జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్‌ తరఫున రంజిత్‌రెడ్డి, నాగేందర్‌లు పోటీ చేసి ఓడిపోయారు.

ఆ త‌ర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత కూడా కాంగ్రెస్ లో చేరారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత బరిలోకి దిగినప్పటికీ ఆమె ఓటమిని చవిచూసింది.

మార్చిలో బీఆర్‌ఎస్‌కు చెందిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికార పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఊపు వచ్చింది. ఆమె తండ్రి కే. కేశవరావు కూడా బీఆర్ఎస్‌ను వీడారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌కు గట్టి బ‌లాన్ని ఇచ్చింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్ నుంచి సీటు కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీ గణేష్ తన సమీప ప్రత్యర్థి బిజెపికి చెందిన టి.ఎన్. వంశ తిలక్‌పై 13,206 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నందిత సోదరి నివేదిత సాయన్న మూడో స్థానంలో నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుండి ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌డంలో ఈ విజయం సహాయపడింది.

జూన్ 28న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరారు. జూలై 12న రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. మరుసటి రోజు మరో BRS ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ ప‌ట్ల త‌న‌ విధేయతను మార్చుకున్నారు.

ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ భేటీ అయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టిడిపి)ని పునరుద్ధరించాలని చంద్ర‌బాబు యోచిస్తున్నందున.. ఈ సమావేశంలో వారు గతంలో ఉన్న టీడీపీలోకి తిరిగి వస్తారనే ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు అలాంటి ప్రచారాల‌ను ఖండిస్తూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రకాష్ గౌడ్ 2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2014లో తిరిగి ఎన్నికైన ఆయన ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. అతడు 2018 లో BRS అభ్యర్థిగా గెలిచాడు. ఇటీవలి ఎన్నికలలో కూడా త‌న స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

జూలై 13న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గాంధీ 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) టిక్కెట్‌పై శేరిలింగంపల్లి నుంచి ఎన్నికయ్యారు, కానీ ఆ తర్వాత బిఆర్‌ఎస్ లో చేరారు. 2018, 2023లో సీటును నిలబెట్టుకున్నారు.

వచ్చే ఏడాది మునిసిపల్ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తాజా ఫిరాయింపులు సహాయపడతాయని భావిస్తున్నారు.

గతంలో 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో 150 వార్డులకు గాను 55 చోట్ల గెలుపొంది బిఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలవగా.. ఏఐఎంఐఎం 44 వార్డులను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది.

ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే.. కాంగ్రెస్‌ AIMIMతో కంచెలు సరిచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు స్నేహపూర్వక పార్టీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి త‌గ్గ‌ట్లుగా తన వైఖరిని మార్చుకుంది. హైదరాబాద్ మినహా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.

AIMIM చారిత్రాత్మకంగా GHMCలో కింగ్‌మేకర్ పాత్రను పోషిస్తుంది. హంగ్ తీర్పు వచ్చినప్పుడు.. కాంగ్రెస్‌కు సొంత మేయర్ కావాలంటే AIMIM మద్దతు కీలకం.

Tags:    

Similar News