Telangana : రేషన్‌, హెల్త్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న అర్హులైన కుటుంబాలకు త్వరలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటించారు

Update: 2024-09-16 14:51 GMT

తెలంగాణలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న అర్హులైన కుటుంబాలకు త్వరలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అక్టోబర్‌లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఎర్రమంజిల్ జలసౌధలో రేషన్, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం 4వ సమావేశం అనంత‌రం ఈ ప్రకటన వెలువడింది.

అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు, ఆరోగ్య కార్డుల ద్వారా ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధృవీకరించారు. ప్రస్తుత నిబంధనలు, విధివిధానాలపై చర్చలు సహా కొత్త కార్డుల జారీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా ఖరారు చేయనున్నట్లు ఆయన వివరించారు.

ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్, హెల్త్ కార్డులు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

వచ్చే నెలలోగా తెల్ల రేషన్‌ కార్డులకు అర్హులను నిర్ణయిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎంపిక‌ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, రేషన్, ఆరోగ్య సేవలకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News