Telangana : రేపు బడ్జెట్.. 31 వ‌ర‌కూ సమావేశాలు.. బీఏసీ నిర్ణ‌యం

బడ్జెట్ సమావేశాలను జూలై 31 వరకూ నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది.

By :  Eha Tv
Update: 2024-07-24 04:00 GMT

బడ్జెట్ సమావేశాలను జూలై 31 వరకూ నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో మంగళవారం ఆయన ఛాంబర్‌లో సమావేశమై సమావేశాల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎంఐఎం ఎమ్మెల్యే బలాల తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్‌ను జులై 25న ప్రవేశపెట్టినా.. జూలై 31న అసెంబ్లీ ఆమోదించనుంది. బడ్జెట్ రోజున రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఉదయం 9 గంటలకు సమావేశమై ఆమోదం తెలుపనుంది. ఆమోదం పొందిన తర్వాత విక్రమార్క సభలో ప్రవేశపెడతారు.

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ బడ్జెట్ సమావేశాన్ని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. గత అసెంబ్లీ సెషన్‌లో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి గ్రాంట్లు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ జరగలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో ఒవైసీ పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేత టీ హరీశ్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం జూలై 31 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల‌ని.. గురువారం బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణయించింది.

Tags:    

Similar News