Income Tax : మీ నెల‌ జీతం రూ.64 వేలు అయినా కూడా ఆదాయ పన్ను పరిధిలోకి రారు.. ఎలాగంటే..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలోని పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు

By :  Eha Tv
Update: 2024-07-24 03:40 GMT

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలోని పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త ప‌న్ను రేట్ల అమలుతో దేశంలోని దాదాపు నాలుగు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రూపంలో 17,500 రూపాయల వరకు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దీంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ ఐటమ్ కింద రూ.50,000 మినహాయింపు మొత్తాన్ని రూ.75,000కి ఆర్థిక మంత్రి పెంచారు. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ఉంచారు. అయితే రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈసారి పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేశారో తెలుసుకోండి..

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రకటన తర్వాత.. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 7 లక్షల 75 వేల వరకు ఉంటే.. స్టాండర్డ్ డిడక్షన్‌లో రూ. 75,000 మినహాయించినట్లయితే.. అతని ఆదాయం సంవత్సరానికి రూ.7 లక్షలు అవుతుంది. అటువంటి పరిస్థితిలో అతడు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి నెలవారీ జీతం దాదాపు రూ.64,000 లేదా రూ.64,500 అయితే కొత్త పన్ను విధానంలో అతడు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వార్షిక ఆదాయం రూ. 7,50,000 లోపు ఉంటేనే పన్ను చెల్లింపుదారు పన్ను చెల్లింపు నుండి ఉపశమనం పొందవచ్చు.

కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు మాత్రమే ఆదాయం పన్ను రహితం అయినప్పటికీ.. రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద లభించే మినహాయింపు. సెక్షన్ 87A ప్రకారం.. ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షలు అయితే.. అతనికి పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది.. ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 8 లక్షల 50 వేలు అయితే.. స్టాండర్డ్ డిడక్షన్‌లో రూ. 75,000 తీసివేస్తే.. అతని ఆదాయం రూ. 7,75,000 వేలకు తగ్గుతుంది. కొత్త పన్ను విధానం ప్రకారం.. కొత్త రేటు ప్రకారం రూ.27,500 ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత రేట్ల ఆధారంగా.. పేర్కొన్న పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షలుగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాత రేట్ల ప్రకారం రూ.35వేలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ విధంగా శ్లాబ్‌లను మారుస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన తర్వాత.. పన్ను చెల్లింపుదారుడికి ఇప్పుడు రూ.7,500 ఆదా అవుతుంది.

ఈ గణన ఆధారంగా రూ. 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత.. పన్ను చెల్లింపుదారుడి ఆదాయం రూ. 9,75,000 అని అనుకుందాం.. అప్పుడు పై లెక్క ప్రకారం అతడు రూ. 47,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత ప‌ద్ద‌తి ప్ర‌కారం.. పేర్కొన్న పన్ను చెల్లింపుదారుల ఆదాయం రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం.. సంవత్సరానికి రూ.10 లక్షలుగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను రూపంలో రూ.60 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఈ విధంగా.. కొత్త ప‌న్ను రేట్ల ప్రకటన తర్వాత పన్ను చెల్లింపుదారులకు రూ.12,500 ఆదా అవుతుంది.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. భారతీయ వ్యవస్థలో, స్టాండర్డ్ డిడక్షన్ ఐటమ్ కింద మినహాయింపు ప్రయోజనం కేవలం జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది కాకుండా.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్నుతో పాటు 4% సెస్ కూడా చెల్లించాలి.

Tags:    

Similar News