Pawan Kalyan : ఆ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చు

ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

By :  Eha Tv
Update: 2024-07-07 03:11 GMT

వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాలిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఎస్.ఎల్.ఆర్.ఎం.) ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టూ గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్, శాసనమండలి సభ్యుడు హరిప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాసన్ పర్యావరణహితంగా వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన విధానాలను తెలియచేశారు. చెట్ల నుంచే రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతోందనీ, వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందనీ, ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంలో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, అనంతరం అక్కడ చేపట్టిన మొక్కల పెంపకాన్ని వివరించారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా వచ్చే వర్మీ కాస్ట్ కు మార్కెట్లో డిమాండ్ ఉందని దీనిపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. భూమికి సేంద్రీయ పదార్థాలు, పోషకాలు జోడించడంలో వర్మీ కాస్ట్ పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. రీ సైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ ఒక సవాల్ గా మారుతోందనీ, శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ వర్క్ షాపులో పంచాయతీరాజ్ ప్రతినిధులతోపాటు, వివిధ వర్గాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ విధమైన వర్క్ షాపులు నిర్వహించడం ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయన్నారు. ఉపాధి అవకాశాలు వస్తాయనీ, పర్యావరణానికీ మేలు కలుగుతుందన్నారు

Tags:    

Similar News