Rain Alert : తీరం దాటిన వాయుగుండం.. ఏపీకి వ‌ర్ష హెచ్చ‌రిక‌

వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి 12.30 - 2.30 గంట‌ల‌ మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది

Update: 2024-09-01 03:25 GMT

వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి 12.30 - 2.30 గంట‌ల‌ మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మ‌న్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. వీటితో పాటు ఉత్త‌రాంధ్ర జిల్లాలైన‌ విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. రాయ‌ల‌సీమ జిల్లాలైన వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. వ‌ర్షాల నేప‌థ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కృష్ణా నది వరద ఉధృతి కార‌ణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,55,250 క్యూసెక్కులు ఉంది. దీంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చ‌రించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని.. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

Tags:    

Similar News