West Bengal : గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు మమత ప్రభుత్వం

బెంగాల్‌లో రాష్ట్ర సచివాలయం వర్సెస్ రాజ్‌భవన్ మధ్య పోరు మరో అడుగు ముందుకు వేసింది.

By :  Eha Tv
Update: 2024-07-12 16:28 GMT

బెంగాల్‌లో రాష్ట్ర సచివాలయం వర్సెస్ రాజ్‌భవన్ మధ్య పోరు మరో అడుగు ముందుకు వేసింది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది బిల్లులను గవర్నర్‌ అడ్డుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా సుపరిపాలన విషయంలో అవరోధాలు సృష్టిస్తున్నారని పిటీష‌న్‌లో పేర్కోంది.

శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది సంజయ్ బసు మాట్లాడుతూ.. ముఖ్యమైన ఎనిమిది బిల్లులను నిలిపివేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ను దాఖలు చేసిందని.. ఈ కేసును త్వరగా విచారించాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించింది.

రాష్ట్రం తరపున న్యాయవాది ఆస్తా శర్మ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిలో మొదటి ఆరు చట్టాలను జగదీప్ ధన్‌కర్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆమోదించింది. సీవీ ఆనంద్ గవర్నర్ అయిన తర్వాత రెండు బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం ఎనిమిది బిల్లులు ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.

పాత కేసుల ఉదాహరణలను ఉటంకిస్తూ.. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను నిలిపివేసినందుకు నాలుగు రాష్ట్రాల గవర్నర్‌లకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చిందని ఆస్తా శర్మ అన్నారు. ఆగిపోయిన బిల్లులను వెంటనే వెనక్కి పంపాలని తెలంగాణ, పంజాబ్ గవర్నర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది తమిళనాడు, కేరళ గవర్నర్లు కూడా ఈ బిల్లును నిలిపివేసినందుకు సుప్రీంకోర్టు విమర్శించింది.

Tags:    

Similar News