Pawan Kalyan:పవన్ చెప్పిందేంటి? ప్రభుత్వం చేస్తున్నదేంటి?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సంబంధించిన కొన్ని సమస్యలపైన నేరుగా తమ ప్రభుత్వాన్నే పశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వంపైన ప్రజలలో వ్యతిరేకత వస్తున్నది కాబట్టి, ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే పవన్ కల్యాణ్ ఈ చర్యలకు పాల్పడుతున్నారనీ, చంద్రబాబునాయుడు-పవన్ కల్యాణ్ కలిసి చేస్తున్న కార్యక్రమమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. పవన్ మాట్లాడుతున్న మాటలను, ఆ మాటల వెనుక ఉన్న అంతరార్ధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడమర్చి చెబుతూ ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని భావిస్తోంది. మరోవైపు తెలుగుదేశంపార్టీకి చెందిన కొంత మంది నాయకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. పవన్ కల్యాణ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? మన ప్రభుత్వంపైనే ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారు? పవన్ కల్యాణ్ వెనుక భారతీయ జనతా పార్టీ ఏమైనా ఉన్నదా? పవన్ను బీజేపీ నడిపిస్తోందా? పవన్ బీజేపీ నాయకులతో మాట్లాడి, వారి డైరెక్షన్ ప్రకారమే నడుచుకుంటున్నారా? చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు మాట్లాడుతున్నారా? ఇలాంటి సందేహాలతో వారు ఉన్నారు. పార్టీల భావనలను, చింతనలను పక్కన పెడితే మనకు మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. అసలు పవన్ మాట్లాడుతున్నదేమిటి? కూటమి ప్రభుత్వం చేస్తున్నదేమిటి? ఇందుకు రెండు మూడు ఉదాహరణలను చెప్పుకోవచ్చు. పవన్ కల్యాణ్ ఇటీవల హోం మంత్రి అనిత గురించి, డీజీపీ గురించి మాట్లాడారు. ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడారు? 'రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదు. శాంతి భద్రతలు బాగా ఉన్నాయని బయటకు చెబితే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. హోం మంత్రిగారు ఏం చేస్తున్నారు? డీజీపీగారు మీరేం చేస్తున్నారు?' అంటూ పవన్ మాట్లాడారు. శాంతిభద్రతల గురించి మాట్లాడితే జనం తిడుతున్నారని పవన్ చేసిన కామెంట్ పట్ల ప్రభుత్వం ఎందుకు రియాక్టవ్వలేదు? పవన్ ఈ మాట అన్న మరుసటి రోజే క్యాబినేట్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశం అనంతరం అందులో ప్రభుత్వం తీసుకున్న కార్యచరణ ఏమిటో బయటకు వచ్చింది. కొంత సమాచారం కూడా బయటకు పొక్కింది. పవన్ చేసిన కామెంట్ల గురించి అసలు ఎవరూ మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై చర్చ జరిగింది. వారిని అరెస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేసిన వైసీపీ నేతలపై కేసులు పెట్టాలని డిసైడయ్యింది. పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్ ఇది కాదుగా! నిజానికి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో టీడీపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలి. కానీ పవన్ కల్యాణ్ అడిగింది ఇది కాదు కదా! ఆయన అడిగింది శాంతి భద్రతల సమస్యలపైనా. పవన్ ఈ మాటలు మాట్లాడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాల ఘటనలు జరిగాయి. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఇన్సిడెంట్లు జరిగాయి. మహిళల సజీవ దహనాలు జరిగాయి. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం వల్ల రాష్ట్రంలో ఓ భయానక వాతావరణం ఏర్పడిందని, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని పవన్ అగిడితే ఇంత పెద్ద సీరియస్ ఇష్యూను పక్కన పెట్టి సోషల్ మీడియాలో పోస్టింగులపై మంత్రివర్గం చర్చించింది. పైగా పవన్ కూడా సోషల్ మీడియా గురించే మాట్లాడారు అని లీక్స్ ఇప్పించారు. చివరకు హోమంత్రి అనిత వెళ్లి పవన్ను కలిస్తే పవన్ కల్యాణే అనితకు వివరణ ఇచ్చారట! తన పిల్లలను తిట్టినందువల్ల ఆవేదనతో అలా మాట్లాడాల్సి వచ్చిందని పవన్ చెప్పుకున్నారని తెలుగుదేశం పార్టీ మీడియా రాసుకొచ్చింది. లేటెస్ట్గా పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అవుతుందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతోందని అడిగారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేను నిలదీశారు. సీజ్ ద బోట్ అన్నారు. ఈ పదం సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం అక్రమంగా తరలివెళుతున్న బియ్యం సంగతి పట్టించుకోలేదు.
