సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పాడా.. ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడా? రాష్ట్రాలు ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. లేనిది ఉన్నట్టుగా చెప్పడం అలవాటైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు వివిధ విభాగాలతో మాట్లాడి, ఉత్తరాలు రాస్తూ అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నాను. ఇవాళ బెదిరింపు రాజకీయాలు చేస్తే ఎవరు భయపడేవారు లేరు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మేవారు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని నమ్మి ఇపుడు ఆయన ఎలాంటి గాలి మాటలు మాట్లాడుతారో ప్రజలు అర్థం చేసుకున్నారు. నేనేం ఆయన, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో పార్లమెంట్ లోకి రాలేదు.. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని. రేవంత్ మాటలకు నేను జవాబుదారీని కాదు. ముఖ్యంగా ఒక్క విషయంలో అయినా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే నేను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించాలని సవాలు చేస్తున్నాను. చేతకాని ముఖ్యమంత్రి, దమ్ము లేని ముఖ్యమంత్రి, మాటలు చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే ఎలాంటి ఆర్థిక ప్రణాళిక చేస్తారో కూడా ఓ కార్యాచరణ లేదు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డబ్బులు తెచుకుంటారో కూడా ఆయనకు ఓ క్లారిటీ లేదు. ఇటీవలే ప్రాజెక్టును కేంద్రానికి పంపారు. అది అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఇలా పంపగానే అలా అయిపోదు. దానికో సిస్టం ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి అవగాహన లేకుండా దుందుడుకుగా మాట్లాడుతున్నారు.
