ఎన్నికలు(Elections) దగ్గరపడేకొద్దీ జుక్కల్ నియోజకవర్గంలో(Jukkal Assembly Constituency) పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Hanmanth Shinde)..మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మరోవైపు లోకల్..నాన్ లోకల్ గొడవ జుక్కల్ చర్చనీయాంశంగా మారింది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ మంత్రం ఫలిస్తుందా?

ఎన్నికలు(Elections) దగ్గరపడేకొద్దీ జుక్కల్ నియోజకవర్గంలో(Jukkal Assembly Constituency) పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Hanmanth Shinde)..మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మరోవైపు లోకల్..నాన్ లోకల్ గొడవ జుక్కల్ చర్చనీయాంశంగా మారింది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ మంత్రం ఫలిస్తుందా? అధికార పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాల వ్యూహాలేంటి? జుక్కల్ లో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

1957లో జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం జుక్కల్. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు మరాఠీ మాట్లాడతారు. అక్కడక్కడ మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి కూడా కనిపిస్తుంటుంది. 1957 నుంచి 1952 వరకు జనరల్ సీటుగా ఉన్న జుక్కల్ 1978 నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాత.. తెలుగుదేశం ఇక్కడ జెండా పాతింది. కాంగ్రెస్ నాయకుడు ఎస్.గంగారామ్ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. ఇక్కడ 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐదుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ ఇది. ఇప్పుడు.. జుక్కల్ బీఆర్ఎస్‌కు(BRS) అడ్డాగా మారింది. జుక్కల్ నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. అవి.. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్, డోంగ్లి. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం లక్షా 89 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దళితులతోపాటు మున్నూరు కాపు, లింగాయత్ సామాజిక వర్గాలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే. 2014లో తన సమీప కాంగ్రెస్(Congress) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారామ్‎పై(S.Gangaram) 41,959 ఓటల ఆధిక్యంతో విజయం సాధించారు. తదుపరి 2018లో కూడా మరోసారి గెలుపొందారు. బీజేపీ(BJP) తరపున పోటీ చేసిన మరో మాజీ ఎమ్మెల్యే అరుణతారకు దాదాపు 28 వేల ఓట్లు వచ్చాయి. ఈమె 1999లో టీడీపీ(TDP) ఎమ్మెల్యేగా ఉండేవారు. 2018లో బీజేపీలోకి మారి పోటీ చేశారు. ఈసారి షీండేకు 77,584 టోలు రాగా, గంగారామ్ కు 35, 625 ఓట్లు దక్కాయి.

అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఎమ్మెల్యే షిండేపై వ్యతిరేకత కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన వివక్ష, మద్నూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పత్తి రైతులకు టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. దళిత బంధు పథకం నిజాంసాగర్ మండలానికి మాత్రమే పరిమితం కావడంతో మిగతా మండలాల్లోని దళితులంతా ఎమ్మెల్యే షిండేపై గుర్రుగా ఉన్నారు. నిజాంసాగర్‌ని టూరిజం పరంగా డెవలప్ చేస్తామన్నా.. అదింకా నెరవేరనే లేదు. మద్నూర్ మండల రైతులకు సాగునీరు హామీ పట్టాలెక్కలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలోనూ జుక్కల్ వెనుకబడింది. ఇవన్నీ.. ఎమ్మెల్యే షిండేకు ప్రతికూలంగా మారే చాన్స్ ఉందంటున్నారు. అయితే గులాబీ పార్టీకి సర్కార్ సంక్షేమ పథకాలే పాజిటివ్‌గా మారతాయనే ఆశలు పెట్టుకున్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని.. ఎమ్మెల్యే హన్మంత్ షిండే నమ్మకంగా ఉన్నారు.

కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న జుక్కల్ నియోజకవర్గం నుంచి ఈసారి ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేతో సౌదాగర్ గంగారాంపాటు మరో ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఒకరు NRI కాగా, మరొకరు మాజీ డీసీసీ. కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్ గంగారాం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు ఓటమిపాలవడంతో ఆయనకు సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ రేసులో నిజామాబాద్‌కు చెందిన గడుగు గంగాధర్ కూడా ఉన్నారు. ఆయన గతంలో డీసీసీ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఇక.. NRI, విద్యావేత్త తోట లక్ష్మీకాంతరావు కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే.. ఆయన వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంకు.. టీపీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి ఆశీస్సులున్నాయనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఇంతమంది ఆశావహుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనేదే ఆసక్తిగా మారింది.

ఇక..ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. బీజేపీ కూడా యాక్టివ్‌గా పనిచేస్తోంది. బీజేపీ విషయానికొస్తే.. అరుణతార జుక్కల్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం.. ఆవిడన కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 1999లో.. ఆమె తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. మళ్లీ.. 2009లో టీడీపీ టికెట్ రాకపోవడంతో.. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. ఆవిడ ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండరనే పేరుంది. ఇదే.. మైనస్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక.. బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడిందని.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. అరుణతార అంటున్నారు.

జుక్కల్‎లో ఈసారి ట్రయాంగిల్ పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే.. వరుసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. మరోవైపు కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ కనిపిస్తోంది. అటు బీజేపీ చాపకిందనీరులా దూసుకొస్తోంది. మూడోసారి గులాబీ జెండా ఎగురుతుందా? కారు పార్టీని ఎదుర్కొనేందుకు.. కాంగ్రెస్, బీజేపీ రచిస్తున్న వ్యూహాలేంటి? ఈసారి జుక్కల్‌‌లో పొలిటికల్ లెక్కలు ఏ విధంగా మారబోతున్నాయన్నది ఆసక్తిరేపుతోంది.

Updated On 21 Oct 2023 12:03 AM GMT
Ehatv

Ehatv

Next Story