ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్..!

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును బెదిరించిన కేసులో యూట్యూబర్‌ శ్యామ్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడిన ఓ యూట్యూబర్, ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ కేసులో శ్యామ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. శ్యాంతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. బండ్లగూడ సన్ సిటీ మప్లెటౌన్‌లోని విల్లా నంబర్ ఎంపి-4లో నివాసం ఉంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసులను ఆశ్రయించాడు. తనకు ప్రజా వాయిస్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ఎం. శ్యామ్ సుందర్‌తో ప్రమాదం పొంచి ఉందని, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో పాటు తన పరువు తీయడానికి ఓ మహిళను ఇంటర్వూ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

రెండు వారాల క్రితం ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు శ్యామ్ ఫోన్ చేసి తనను వ్యక్తిగతంగా కలవాలని కోరాడు. ఈనేపథ్యంలో ఈనెల 15వ తేదీన శ్యామ్ కొంత మంది సహచరులతో కలసి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నం.202కు వచ్చి ఆయనను కలిశాడు. ఆ సమయంలో తన వద్ద నిరూప అనిల్ కుమార్ దదాయని ఇచ్చిన సమాచారం ఉందని చెప్పాడు. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానని, దాంతో లక్ష్మీకాంతరావు వ్యక్తి గత ప్రతిష్టతోపాటు రాజకీయంగా దెబ్బతింటావని బెదిరించాడు. సున్నితమై వీడియోలు బహిర్గతం చేయవద్దంటే రూ. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌కు లొంగని లక్షీకాంతారావు తాను పారదర్శకమైన జీవితాన్ని గడిపానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను బెదిరించడం మానుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా, ఈనెల 21వ తేదీన యూట్యూబర్ శ్యామ్ తన సన్నిహుతుడైన నరేష్ నాయుడు ఫోన్‌కు ఫేక్ స్క్రీన్ షాట్ చిత్రాలు పంపాడు.

ఈ స్క్రీన్ షాట్‌లు లక్ష్మీకాంతరావుకు చూపించాలని సూచించాడు. తాను కోరిన మొత్తం ఏర్పాటు చేయకపోతే నిరూప అనిల్ కుమార్ ఇంటర్వూను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దాంతో శ్యామ్ సుందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. నేరం ఒప్పుకుని లొంగిపోయినట్లు రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. లక్ష్మీకాంతారావును బ్లాక్ మెయిల్ చేయడానికి ఆయన ఉపయోగించినట్లుగా భావిస్తున్న లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే లక్ష్మీకాంతారావుపై నిరూప ఆరోపణలు మరో రకంగా ఉన్నాయి. తనకు 2012లో ఓ స్థలం చూపించి తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని.. తన సోదరుడైన బాలయ్యదిగా ఆ స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలు ఇచ్చి.. నకిలీ రశీదులు కూడా తనకు ఇచ్చాడని వెల్లడించింది. ఈ విషయంపై 2022లో రాజేంద్రనగర్‌ పీఎస్‌లో నిరూప ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ విషయంపై మహిళ స్పందిస్తూ తనతో జుక్కల్‌ ఎమ్మెల్యే ఎఫైర్‌ పెట్టుకుని తనను మోసం చేసినట్లు ఆరోపించింది.

Updated On 25 April 2025 4:57 AM GMT
ehatv

ehatv

Next Story