మే 17న పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది
తెలంగాణ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ వచ్చింది. పాలిసెట్-2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెన్త్ విద్యార్హతతో టెక్నికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని నిర్వహిస్తారు. పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ, ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే పాలిసెట్ లో అర్హత సాధించాలి. ఏప్రిల్ 22 వరకు ఫైన్ లేకుండా ఫీజును చెల్లించవచ్చు. ఇక 100 రూపాయల వరకూ ఫైన్తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 17న పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500 ఫీజు ఉండనుంది. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. పాలిసెట్ పరీక్షల ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులకు ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.