ఇటు కాంగ్రెస్, బీజేపీలో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసిన మేడిపల్లి సత్యం(Medipalli Satyam) వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం…మరోసారి బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. అప్పుడు గట్టి పోటీ ఇవ్వలేకపోయిన సత్యం… ఆ తర్వాత నుంచీ నియోకవర్గంలోనే మకాం పెట్టి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళా చొప్పదండిలో(Choppadandi) రాజకీయం(Politics) రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్‎తో(BRS) పాటు కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)..రెండు పార్టీలు చొప్పదండి స్థానంపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికలు(elections) వస్తున్నాయంటేనే ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తుంటాయి. అన్ని పార్టీల్లో ఉన్న ఆశావాహులు ఇప్పటికే పార్టీ నేతల దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని చేజిక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవికి(Sunke Ravi) ఈసారి టికెట్ కష్టమేనని ప్రచారం జరుగుతుండగా..ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి.

ఉమ్మడి కరీంనగర్‎జిల్లాలో(Karimnagar) చొప్పదండి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతం విప్లవ ఉద్యమాలకు పురిటి గడ్డ. చొప్పదండి రిజర్వు అయ్యేవరకు జరిగిన ఎన్నికల్లో ఐదుసార్లు రెడ్లు, ఒకసారి వెలమ, రెండు సార్లు బీసీలు, ఒకసారి ఇతరులు గెలుపొందారు. 1983 నుంచి 2009 వరకు జరిగిన చొప్పదండి ఎన్నికల్లో ఒక్క 1999లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే..కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్‎లు కలిసి మూడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, టీఆర్ఎస్ రెండుసార్లు, పీడీఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడి నుంచి గెలిచిన న్యాలకొండ రామ్‎కిషన్‎రావు చంద్రబాబు కేబినెట్‎లో సభ్యునిగా కూడా ఉన్నారు. దేవయ్య కూడా చంద్రబాబు కేబినెట్‎లో పని చేశారు. 1957లో చొప్పదండిలో పీడీఎఫ్ పక్షాన గెలిచిన చెన్నమనేని రాజేశ్వరరావు ఆ తర్వాత సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సీపీఐ అభ్యర్థిగా, ఒకసారి టీడీపీ తరపున గెలిచారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయం రోజుకో రంగు మారుతోంది. ప్రధాన పార్టీలన్నింటా ఏదో తెలియని డైలమా కొనసాగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సుంకె రవిశంకర్‌.. ఈసారి బరిలో ఉంటారా? ఉండరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలిక్కడ రాజకీయం.. అనూహ్యమైన మార్పులు తీసుకున్నది 2018లోనే. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. అప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభపై వ్యతిరేకత రావడంతో ఆమెను పక్కనపెట్టి..ఉద్యమ నేతగా ఉన్న సుంకె రవిశంకర్‌కు(Sunke Ravishankar) టిక్కెట్‌ కేటాయించంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనపై కూడా అనేక రకాల అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని రవిశంకర్‎పై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి నిర్వహించిన అనేక సర్వేల్లో ఎమ్మెల్యేకు సానుకూలత 35% మించలేదని తెలుస్తోంది. అందువల్లే ఈసారి కూడా చొప్పదండి ఎమ్మెల్యేను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

చొప్పదండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్‌స్థానంలో.. కొత్త వ్యక్తి వస్తారన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే చాలామంది స్థానిక నేతలు చొప్పదండి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. బోయినపల్లి(Boinapally) జడ్పీటీసీ భర్త కత్తరపాక కొండయ్య(Kattarapaka Kondaiah) రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‎కు(Joginapalli Santhosh) అత్యంత సన్నిహితుడు. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న కొండయ్య… ఆ రూట్‌లో సైలెంట్‎గా టిక్కెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే మండలానికి చెందిన ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కరీంనగర్‌ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌ సహా మరో ఇద్దరు నేతలు టికెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.దీంతో చొప్పదండిలో ఈసారి మార్పులు చేర్పులు తప్పవన్న ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అయితే, ఎమ్మెల్యే రవిశంకర్‌ మాత్రం… మరోసారి సిట్టింగులకే ఛాన్సంటూ అధినేత చేసిన ప్రకటనే ఆయుధంగా.. జనాల్లోకి దూసుకెళ్తున్నారు. ఎవరెలాంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రచారాలుచేసినా… మళ్లీ బంపర్ మెజార్టీతో గెలిచేది తానేనంటూ ధీమాగా ఉన్నారు.

ఇటు కాంగ్రెస్, బీజేపీలో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసిన మేడిపల్లి సత్యం(Medipalli Satyam) వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం…మరోసారి బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. అప్పుడు గట్టి పోటీ ఇవ్వలేకపోయిన సత్యం… ఆ తర్వాత నుంచీ నియోకవర్గంలోనే మకాం పెట్టి.. మరోసారి పోటీకోసం సిద్ధమవుతున్నారు. అయితే, కకావికలంగా మారిన కాంగ్రెస్‌ నుంచి కూడా టిక్కెట్‌ కోసం పోటీ పెరగడం ఇక్కడ రాజకీయ విశేషం. సత్యంతో పాటు ఎన్ఎస్ఎయుఐ మాజీ నేత నాగెల్లి శేఖర్(Nagelli Shekhar) కూడా… చొప్పదండి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. సత్యంతో పోలిస్తే.. నాగెల్లి శేఖర్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ అధికంగా ఉన్నాయి. సామాజిక సమీకరణల లెక్కలేసే హస్తం హైకమాండ్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

అటు బీజేపీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మీద కోపంతో బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీచేసిన బొడిగె శోభ(Bodige Sobha), కేవలం 15వేలు ఓట్లు సాధించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సీన్‌ మారింది. చొప్పదండి నియోజకవర్గంలో 50 వేలకుపైగా ఓట్లు సాధించి.. సత్తా చాటింది బీజేపీ. ఆ తర్వాత కమలంలో జోష్‌ కూడా పెరగడంతో… ఈసారి కచ్చితంగా గెలవగలననే ధీమాతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే శోభ. అయితే కాషాయదళంలోనూ కూడా టిక్కెట్‌వార్‌ ముదరడంతో గందరగోళం ఏర్పడినట్టు కనిపిస్తోంది. బొడిగె శోభతోపాటు మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, మరోనేత లింగంపల్లి శంకర్ ఇక్కడ బీజేపీ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో బీజేపీ తరపున బొడిగె శోభకు అవకాశం ఉంటుందా? లేదా? అనే చర్చ లోకల్‌ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతోంది. అయితే హైకమాండ్‌ మాత్రం జనం నాడి తెలుసుకుని..సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఖరారుచేయాలని భావిస్తోంది. ప్రధాన పార్టీలన్నింటి మధ్యా నేనూ ఉన్నానంటోంది బీఎస్పీ. ఇక్కడ బలమైన అభ్యర్థికోసం అన్వేషిస్తోంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరి లెక్కలు వారివే. ఏ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీవే. మొత్తం రెండు లక్షల 27వేల 615 మంది ఓటర్లుంటే…అందులో దాదాపు 50 వేల ఓట్లు దళితులవే. మాదిగ వర్గానికి చెందిన ఓట్లు 38వేలకుపైగా ఉంటే… మాల వర్గానికి చెందినవి 8 వేల ఓట్లున్నాయి. ఆ తర్వాత పద్మశాలీల ఓట్లు 25వేలు, ముదిరాజ్‌ ఓట్లు 20వేలు, గొల్ల కుర్మలు 20వేలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే సుంకె రవిశంకర్..మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికావడంతో ఈసారి ఏ వర్గం ఎవరికి సపోర్టు ఇస్తుందన్నది కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఎస్సీ, బీసీ ఓట్లు ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌కు పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అన్ని వర్గాలు బీజేపీకి జై కొట్టాయి. అందుకే, ఈసారి సీన్‌ ఎలా ఉంటుందనే డైలమా ఏర్పడింది. అందుకే, అధికార బీఆర్‌ఎస్‌‎సహా ప్రధాన పార్టీలన్నీ గెలుపోటముల మీద ప్రభావం చూపే ఆయా వర్గాలపై గట్టి ఫోకస్‌ పెట్టాయి.

రాజకీయ బలాబలాలు సరే… ప్రజా సమస్యల పరిష్కారం మాటేమిటి? అభివృద్ధి సంగతేమిటి? అన్నదే తాజాగా నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. అభివృద్ధిలో చొప్పదండి నియోజకవర్గం మందంజలో ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అంటున్నారు. 2018లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానంటున్నారు. మిడ్‌ మానేరుతో పాటు, నారాయణ‎పూర్ రిజర్వాయర్ సమస్యలు కూడా తీర్చామంటున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులందరినీ ఆదుకున్నామన్న ఎమ్మెల్యే రవిశంకర్‌… మౌలిక వసతులకు పెద్దపీట వేశామని చెబుతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఓ వర్గం ప్రజలు కూడా ఎమ్మెల్యే చెప్పిన మాట నిజమేనంటున్నారు. సాగు, తాగు నీటి సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీడుగా ఉన్న భూములు ఇప్పుడు సస్యశ్యామలంగా మారాయని ఆనందపడుతున్నారు. గతంతో పోలిస్తే.. గ్రామాల్లో మౌలిక వసతులూ పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

అయితే, ప్రతిపక్షాల వాదన మాత్రం మరోలా ఉంది. 2018 ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విఫలమయ్యారన్నది విపక్షనేతల ఆరోపణ. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించలేదనీ, అది మాటలకే పరిమితమైందనీ విమర్శిస్తున్నారు. ఇక చొప్పదండి నియోజకవర్గంలో ప్రధానమైంది నిర్వాసితుల సమస్య. మిడ్ మానేరు నిర్వాసితుకులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీనిపై ఇప్పటికీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మిడ్ మానేరు బాధిత నిర్వాసితులు కోరుతున్నారు. నారాయణాపూర్ రిజర్వాయర్ కింద ఉన్న నారాయణపూర్‌నూ ముంపు గ్రామంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొండగట్టు బస్సు ప్రమాదంలో… సుమారు 60 మంది చనిపోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి పరిహారం ఇచ్చినా మృతుల కుటుంబాల్ని ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఆదుకుంటామన్న హామీ నెరవేరలేదు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్యఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పూర్తిగా మంచానికి పరిమితమైన తమవారికి ప్రభుత్వం మరింత సాయం చేయాలని కోరుతున్నారు.

సంక్షేమపథకాలు పక్కాగా అమలవుతున్నాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ రోడ్లు అభివృద్ధి చెందాయి. మౌలిక వసతులకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే.. ఆ దిశగా విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అయితే, భూనిర్వాసితులు, పూర్తికాని డబుల్‌ బెడ్రూం ఇండ్లు, కొండగట్టు ప్రమాదం బాధితుల తీరనివెతలు.. ఎమ్మెల్యే ట్రాక్‌ రికార్డులో మైనస్‌గా మారాయి. మరి, వచ్చేసారి ఎన్నికల్లో ఈ అంశాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదే ఆసక్తి రేపుతోంది.

Updated On 1 Sep 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story