సత్తుపల్లి నియోజకవర్గంలో(Sathupalli Constituency) హ్యాట్రిక్ ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్యకు(Sandra Venkataweeraiah) ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయా.. టీడీపీ(TDP) సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది? మారిన రాజకీయ సమీకరణాల్లో సత్తుపల్లిలో(Sathupalli Constituency) గెలుపెవరిది.. ఇచ్చిన హామీ లేంటి..

సత్తుపల్లి నియోజకవర్గంలో(Sathupalli Constituency) హ్యాట్రిక్ ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్యకు(Sandra Venkataweeraiah) ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయా.. టీడీపీ(TDP) సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది? మారిన రాజకీయ సమీకరణాల్లో సత్తుపల్లిలో(Sathupalli Constituency) గెలుపెవరిది.. ఇచ్చిన హామీ లేంటి.. ఎమ్మెల్యేగా సండ్రా చేసిన అభివృద్ధి ఏంటి.. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా..విపక్షాల అభ్యర్థులపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ఖమ్మం(Khammam) ఖిల్లాలో రాజకీయ ఉద్ధండులను అందించిన చరిత్ర సత్తుపల్లిది. తెలంగాణలో ఉంటూ ఆంధ్రాసరిహద్దు ఎక్కువగా కలిగిన నియోజకవర్గం సత్తుపల్లి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం.. జగలం, తుమ్మల, పొంగులేటి వంటి ఎందరో నేతలకు రాజకీయ జన్మనిచ్చింది. దీంతో సత్తుపల్లిలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎస్సీ రిజర్వుడైన ఈ నియోజకవర్గంలో 2009తోపాటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లోనూ సైకిల్ జోరు కొనసాగింది. ఇప్పుడు కూడా సత్తుపల్లిలో టీడీపీ ప్రధాన రాజకీయ శక్తిగానే కనిపిస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న సత్తుపల్లిలో కారు జోరు కొనసాగుతుందా?
అన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గమైనప్పటికీ ఎన్నికల్లో గెలుపోటములను శాసించేది మాత్రం ఇతర సామాజిక వర్గాల నేతలే. అయితే ప్రస్తుతానికి మాత్రం షంషేర్ సండ్ర వెంకట వీరయ్యే. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన ఆయన… మరోసారి బరిలో దిగుతున్నారు. ఎస్సీ రిజర్వుడుగా మారిన తర్వాత… తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవాను తట్టుకుని టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వీరయ్య. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్‌రావుపై 14వేల 300 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టిన వీరయ్య… 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా… విక్టరీని కంటిన్యూ చేశారు. అయితే, 2014లో సమీప వైసీపీ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ పై 2వేల 300 స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. అయితే, 2018లో మరోసారి టీడీపీ అభ్యర్థిగా 19వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి సత్తుపల్లిలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రూటు మార్చి కారెక్కారు సండ్ర వెంకటవీరయ్య.

వేంసూరు నియోజకవర్గం కాస్త.. 1978లో సత్తుపల్లి నియోజకవర్గంగా మారిపోయింది. 1952లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన జలగం వెంగళరావు… ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వెంగళరావు కుటుంబానికి నియోజకవర్గంలో మంచిపట్టు ఉంది. గత ఎన్నికల్లో వెంగళరావు కుమారుడు ప్రసాదరావు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో పసుపుపార్టీ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ క్రమంగా ఉనికి కోల్పోయినా.. ఇప్పటికీ ఆ పార్టీకి నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది. క్షేత్రస్థాయి బలంతో ఈ ఎన్నికల్లోనూ పోటీకి రెడీ అవుతోంది టీడీపీ. ఖమ్మంలో పార్టీకి ఖచ్చితంగా పునర్ వైభవం వస్తుందనీ ఆశాభావంతో ఉన్నారు హార్డ్‌కోర్‌ సైకిల్‌ ఫ్యాన్స్‌.

గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులు ఏర్పడటంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటికి(Poguleti Srinivas Reddy) సత్తుపల్లే సొంత నియోజకవర్గం కావడంతో వారిద్దరి అనుచరులను ఇక్కడి నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్, గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన మట్టా దయానంద్, పీసీసీ మెంబర్ మానవతారాయ్, పొంగులేటి ప్రధాన అనుచరుడు కొండూరు సుధాకర్ సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి సంభాని మాత్రం హైకమాండ్ అండదండలతో టికెట్ తనదేననే నమ్మకంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. టికెట్ దక్కని వారు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తారేమోననే టెన్షన్ పడుతోంది కాంగ్రెస్ క్యాడర్.

కాంగ్రెస్‌లో గ్రూపులతో అధికార బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఎమ్మెల్యే సండ్రతోపాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తే విజయం సాధించే పరిస్థితి ఎలా ఉన్నా.. ఆ పార్టీ చీల్చే ఓట్లు బీఆర్ఎస్‌ను దెబ్బతీస్తాయేమోననే ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు రెండూ గెలుపు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, సత్తుపల్లి నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ బలం లేదు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ కనిపిస్తోంది.. ఈ పోటీలో ఎవరు విజేతలో డిసెంబర్ 3నే తేలనుంది.

Updated On 14 Oct 2023 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story