శేరిలింగంపల్లి(Serilingampally ) అంటేనే అభివృద్ధికి చిరునామా. చారిత్రాత్మక చార్మినార్ ఎంత ఫేమస్సో హైదరాబాద్‎లో హైటెక్ సిటీ కూడా అంతే ఫేమస్. దేశవిదేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హైటెక్ సిటీ(Hitech City) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(Serilingampally Constituency) ఉండటం మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఆకాశ హర్మ్యాలు లాంటి భవనాలు.. అధునాతన హంగు ఆర్భాటాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది.

శేరిలింగంపల్లి(Serilingampally ) అంటేనే అభివృద్ధికి చిరునామా. చారిత్రాత్మక చార్మినార్ ఎంత ఫేమస్సో హైదరాబాద్‎లో హైటెక్ సిటీ కూడా అంతే ఫేమస్. దేశవిదేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హైటెక్ సిటీ(Hitech City) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(Serilingampally Constituency) ఉండటం మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఆకాశ హర్మ్యాలు లాంటి భవనాలు.. అధునాతన హంగు ఆర్భాటాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శేరిలింగంపల్లి అభివృద్ధి మాత్రం ఆగదు. అందుకే అభ్యర్థులెవరైనా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మినీ ఇండియాగా(Mini India) పిలుచుకునే శేరిలింపల్లిలో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? శేరిలింగంపల్లి షంషేర్ ఎవరు?
మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

పునర్విభజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం 2009లో ఏర్పడింది. ఒకప్పుడు ఖైరతాబాద్(Khairathabad) నియోజకవర్గంలో భాగంగా ఉన్న మియాపూర్, చందాన‌గ‌ర్, బాలాన‌గ‌ర్, కూక‌ట్ ప‌ల్లి, వివేకానంద న‌గ‌ర్, బిహెచ్ఇఎల్, హ‌ఫీజ్ పేట‌, కొండాపూర్, గ‌చ్చిబౌలి, రాయ‌దుర్గం ప్రాంతాలను కలిపి కొత్తగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు . శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం అటు భౌగోలికంగా ఇటు సామాజికంగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న నియోజకవర్గం. రాష్ట్రంలోని..ఆ మాటకొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎంతో ఆధునికమైన జీవన శైలిని పాటించేవారు ఒకవైపు..అంతకు రెండింతలు దుర్భర స్థితిలో మురికివాడల జీవనం మరోవైపు కోట్ల రూపాయల వాణిజ్యం నిర్వహించే బిజినెస్ మ్యాన్ లు ఒకవైపు, లక్ష రూపాయల ఉద్యోగాలు నిర్వహించే నిపుణులు మరోవైపు. నిత్యం కూలి పనులతో కడుపు నింపుకునే వర్గం మరోవైపు. మొత్తంగా నియోజకవర్గంలోని ఓటర్లలో అధిక శాతం మంది స్థానికేతరులే. సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి స్థిరపడిన వారి సంఖ్య అధికం. ఇంతటి వైరుధ్యం కలిగిన ఓటర్లను ఆకర్షించాలంటే నాయకులు కూడ అంతే వైవిధ్యంగా వ్యవహరించాల్సి వస్తుంది. అన్ని వర్గాల ప్రజల వారి వారి అవసరాలను బట్టి అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ విజయానికి ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఆధిక్యం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు వారి వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

"కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి"..ఇది పెద్దలు చెప్పే సామెత. ఇదే మాటను ఇప్పుడు అన్ని పార్టీలు జపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్దదైన శేరిలింపంల్లి నియోజకవర్గంపై కన్నేశాయి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓట్లలో దాదాపు మడొంతుల ఓటర్లున్న ఈ నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ జయాపజయాలను శాసించేంతటి కీలకమైన శాసనసభా స్థానంలో ఆధిక్యం సాధించేందుకు అన్ని ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. శేరిలింగంపల్లిలో అధిక ఓటు షేర్ సాధించేందుకు అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ మెజార్టీ తమదంటే తమదంటూ ఎవరికివారే అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీలు ఎక్కడ ఎన్ని ఓట్లు పడినా కలిసొచ్చినట్టేనని భావిస్తుంటే..మరికొన్ని పార్టీలు ఈ స్థానంలో అధిక్యంపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్వసిస్తున్నాయి. శేరిలింగంపల్లి ఆధిక్యంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం నియోజకవర్గ ఓటర్లు ఎలా స్పందిస్తారోనన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్ పార్టీలు(Congress) నువ్వానేనా అన్నట్లు పోటీ ప‌డుతున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న శేరిలింగంపల్లి హైటెక్ సిటీ ఏర్పాటుతో అధునాత హంగులతో అభివృద్ధి పథాన దూసుకుపోతోంది. హైద‌రాబాద్ అంటేనే ఈ ప్రాంతమే అంద‌రికీ గుర్తుకువ‌చ్చేలా మారిపోయింది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఐతే ఇదే ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని మురికివాడలూ కనిపిస్తున్నాయి. గత ఎన్నిక‌ల్లో ఆరు ల‌క్ష ఓట‌ర్లు ఉండగా, ఈ సారి ఓటర్లు గణనీయంగా పెరిగే అవ‌కాశం కనిపిస్తోంది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు.. ఐటీ అనుబంధ రంగాల్లో స్థిరపడిన వారితో శేరిలింగంపల్లికి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా శాశ్వతంగా స్థిరపడిపోవడంతో ఓటర్ల సంఖ్య ప్రతిసారి అనూహ్యంగా పెరుగుతోంది.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. హైటెక్‎సిటీలో దాదాపు 90 శాతం ఈ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోనే ఉండటంతో ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. శాస‌న‌స‌భ్యులు అడిగినా.. అడ‌గ‌క పోయినా.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా మారిపోయింది. ఐతే జనాల రద్దీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ స‌మ‌స్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కానికి కొత్త ర‌హ‌దారులు, ఫ్లైఓవర్‌లను నిర్మిస్తోంది ప్రభుత్వం. కానీ, ప్రధాన ర‌హ‌దారిపై ఉన్న రైల్వే ట్రాక్ మాత్రం సమన్యను యథాతథంగా ఉంచుతోంది. ఇక్కడ ఎప్పుడో నిర్మించిన అండ‌ర్ పాస్ బ్రిడ్జ్ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అండర్‌పాస్‌ను మరింత విస్తరిస్తేనే స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం లభిస్తోందని అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో కాస్త ఆలస్యమవుతోందని అంటున్నారు నాయకులు.

2009లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగాయి. మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచాయి. ప్రభుత్వ ప్రాధాన్య నియోజకవర్గంగా మారిన శేరిలింగంపల్లిలో పోటీకి ప్రధాన పార్టీల్లో తీవ్ర డిమాండ్ ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టిక్కెట్ దక్కించుకోవడమే ప్రధానంగా మారింది. ఈ పరిస్థితి అన్ని పార్టీలలోనూ కనిపిస్తోంది. 2014లో టీడీపీ(TDP) తరఫున పోటీ చేసి గెలిచిన అరికపూడి గాంధీ(Arikapudi Gandhi) ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో గులాబీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధితోనే మ‌రోసారి విజ‌యం సాధిస్తాన‌ని అంటున్నారు. ఐతే 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన గాంధీని విప్‌(VIP)గా నియమించారు సీఎం కేసీఆర్(CM KCR). ఐతే మంత్రి ప‌ద‌వి ద‌క్కలేద‌న్న అసంతృప్తితో విప్ పదవిని చాలా రోజులు తీసుకోలేదు గాంధీ. దీంతో ఎమ్మెల్యే గాంధీ, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ క్యాడ‌ర్‌ను పటిష్ట పరచలేదన్న అసంతృప్తి కూడా ఎమ్మెల్యేపై ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యే అనుచరులు భూవివాదాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు మైనస్‌గా మారుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రత్యర్థుల ఆరోపణలేకాని వాస్తవాలు లేవంటున్నారు ఎమ్మెల్యే గాంధీ. శేరిలింగంపల్లిలో మళ్లీ విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జెర్రిపాటి జైపాల్(Jerry patti Jaipal), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas) సన్నిహితుడు ర‌ఘు యాద‌వ్ టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డంతో ఈ సారి ఆశలు పెట్టుకుంటున్నారు హస్తం నేతలు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రఘునాథ్ యాదవ్(Raghu Yadav).. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బలమైన నాయకుడిని బరిలోకి దించితే విజయం ఖాయమంటున్నారు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కంటే భూ కబ్జాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే త‌న‌కే పోటీ చేసే అవ‌కాశం ద‌క్కుతుందంటున్నారు జైపాల్.

మరోవైపు బీజేపీలో ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన యోగానంద్ ఈ ఎన్నిక‌ల్లో కూడా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే త‌న‌యుడు ర‌వి యాద‌వ్ టికెట్ హామీతోనే బీజేపీలో చేరిన‌ట్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీలో జరిగిన మార్పులు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. బండి సంజ‌య్ అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో ర‌వి యాద‌వ్ బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు కిష‌న్ రెడ్డి అధ్యక్షుడిగా రావ‌డంతో ఆర్ఎస్ఎస్‎తో స‌త్సంబంధాలున్న యోగానంద్‌కే టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఈ విశ్లేషణలతో యోగానంద్, రవి యాదవ్ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇద్దరి అనుచరులు ఆ మధ్య బాహాబాహీకి దిగడం.. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తోంది. ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మువ్వ సత్యనారాయణ కూడా పోటీకి సై అంటున్నారు. ఈ ముగ్గురిలో టిక్కెట్ ఎవరికి ఇస్తుందో.. ఎవరు ఎవరికి పోటీగా నిలుస్తారో ఇంట్రస్టింగ్ మారింది.

తెలుగుదేశం పార్టీకి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2018 ఎన్నిక‌ల్లో నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త పోటీ చేసి ల‌క్ష ఓట్లను సాధించారు. బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా మారే చాన్స్ క‌నిపిస్తోంది. ఇలా హోరాహోరీగా కనిపిస్తున్న శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు త‌ప్పద‌న్న సంకేతాలే కనిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా మారే చాన్స్ క‌నిపిస్తోంది.

Updated On 14 Oct 2023 8:09 AM GMT
Ehatv

Ehatv

Next Story