కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హంగర్‌ ఇండెక్స్‌ (Hunger Index) నివేదికను తప్పుపడుతూ 140 కోట్ల మంది దేశ ప్రజలలో మూడు వేల మందిని పిలిచి ఆకలేస్తుందా అని వారిని ప్రశ్నించి ఆకలి సూచీని లెక్కిస్తారని స్మృతి ఇరానీ అన్నారు. స్మృతి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అజ్ఞానంతో కూడిన ఆమె మాటల్లో కొంచెం కూడా కనికరం లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఏడాది విడుదలైన హంగర్‌ ఇండెక్స్‌ […]

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హంగర్‌ ఇండెక్స్‌ (Hunger Index) నివేదికను తప్పుపడుతూ 140 కోట్ల మంది దేశ ప్రజలలో మూడు వేల మందిని పిలిచి ఆకలేస్తుందా అని వారిని ప్రశ్నించి ఆకలి సూచీని లెక్కిస్తారని స్మృతి ఇరానీ అన్నారు. స్మృతి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అజ్ఞానంతో కూడిన ఆమె మాటల్లో కొంచెం కూడా కనికరం లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఏడాది విడుదలైన హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ఇండియా 11వ స్థానంలో ఉంది. ఆకలి సూచీలో పాకిస్తాన్‌ (102) కంటే భారత్‌ వెనుకబడి ఉండటాన్ని ప్రశ్నించినప్పుడు స్మృతి ఈ రకంగా స్పందించారు. భారతదేశ కథను ఇలాంటి సూచికలు అంచనా వేయలేవని, ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటుందని స్మృతి అన్నారు. 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ లెక్కలను చాలామంది తోసిపుచ్చుతుంటారు. భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజల్లో 3 వేల మందిని పిలిచి, ఆకలి వేస్తుందా..? అని ఇండెక్స్‌ రూపకర్తలు ప్రశ్నించి ఉంటారు. అలా ఈ సూచీని రూపొందించి ఉంటారు. ఆ ఇండెక్స్ ప్రకారం భారత్‌ కంటే పాకిస్థాన్‌ మెరుగ్గా ఉంది. అది సాధ్యమా?’ అని మంత్రి అన్నారు. 'నేను ఉదయం అయిదు గంటలకు ఫ్లైట్‌లో కోచికి వెళ్లాను. అక్కడ్నుంచి మరో ప్రోగ్రామ్‌ అటెండయ్యాను. అది ముగిసే సరికి 11 గంటలయ్యింది. పొద్దున్నుంచి నేను ఏమీ తినలేదు. ఇప్పుడు ఎవరైనా నాకు ఫోన్‌ చేసి ఆకలిగా ఉందా? అని అడిగితే కచ్చితంగా నేను ఉందనే చెబుతాను' అని వ్యంగంగా మాట్లాడారు స్మృతి ఇరానీ. ఈ మాటలు సహజంగానే చాలా మందిని బాధించాయి. విపక్ష పార్టీలైతే ఆమెపై విరుచుకుపడుతున్నాయి. ‘ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది. కొంతమందిని పిలిచి, ఆకలిగా ఉందా అని అడిగి, ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా?’అని కాంగ్రెస్‌ (Congress) నేత సుప్రియా శ్రినేట్‌ ట్వీట్ చేశారు. ‘మీరు భారత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల, పౌష్టికాహారలోపం వంటి నాలుగు సూచికల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకలిని అపహాస్యం చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది’ అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రిగారు అహంకారానికి మరో రూపంగా ఉన్నారు’ అంటూ ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన శివసేననేత ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.

Updated On 21 Oct 2023 6:45 AM GMT
bodapati ashok

bodapati ashok

Next Story