బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న మంత్రి ఉత్తమ్ మాటలకు మాజీమంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు

బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న మంత్రి ఉత్తమ్ మాటలకు మాజీమంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ విషయంలో మంత్రులకు అవగాహన, చిత్తశుద్ధి లేదు అన్నారు. ఖమ్మం మంత్రుల అత్యుత్సాహం, నల్లగొండ మంత్రుల చేతగానితనంతోనే కాల్వకట్టలు తెగిపోయాయన్నారు. మంత్రుల వైఫల్యాలు అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దుర్మార్గంగా గేట్లకు లాక్‌లు, వెల్డింగులు పెట్టడంతోనే కాల్వలు తేగాయన్నారు. ప్రభుత్వ పాలసీ వల్లే కాల్వల మరమ్మత్తులు ఆలస్యం అవుతుంద‌న్నారు. అంతటా నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఇక్కడ మాత్రం పొలాలు ఎండుతున్నాయన్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు మంత్రులు ఉన్నా రైతుల పొలాలకు నీళ్ళందడంలేదన్నారు. హడావుడి పనులు నాసిరకంగా మారాయన్నారు.

కింది స్థాయి అధికారుల మీద అరవడం మాని పొలాలకు నీళ్ళందించండని సూచించారు. ప్రభుత్వ వికృత చర్యల వల్ల అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేక భయపడుతున్నారని.. జరిగిన నష్టానికి ప్రభుత్వ పెద్దలదే బాధ్యత వ‌హించాల‌న్నారు.

గతంలో కాల్వలు తెగితే వారంలో నీళ్ళందించామ‌ని.. ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు అనుమానం వస్తుందన్నారు. కాల్వలు తెగడానికి ఎవరు కారణమే విచారణకు సిద్ధమా అని స‌వాల్ విసిరారు. మీలా చిల్లర రాజకీయాలు చేయడం మాకు అలవాటు లేదు అన్నారు. మీ వైఫల్యాలు కప్పిపుచ్చి బీఆర్ఎస్ పై నిందలు వేస్తారా అని మండిప‌డ్డారు. 5 ఏళ్ళ తప్పులు 10 నెలల్లో చేశారు.. ప్రజలు అన్నీ లెక్కకడుతున్నారని హెచ్చ‌రించారు. అనుభవం లేకపోతే అధికారుల దగ్గర నేర్చుకోండని సూచించారు.

కేసీఆర్ ఇచ్చిపోయిన వ్యవస్థలు ఉన్నదిఉన్నట్టుగా నడిపలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు.. 24 రోజులు గడుస్తున్నా పొలాలకు నీళ్ళందడంలేదన్నారు. మంత్రులు పరిపాలన వదిలి ఇల్లు చక్కబెట్టుకునే పనిలోపడ్డారన్నారు. తక్షణమే 24 / 7 పనిచేసి మరమ్మత్తులు పూర్తిచేసి పొలాలకు నీళ్ళందించాలన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story