కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మ‌పురి శ్రీనివాస్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మ‌పురి శ్రీనివాస్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు ప‌ర్యాయాలు పీసీసీ అధ్య‌క్షుడిగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ (76) తెల్లవారుజామున 3 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. శ్రీనివాస్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గత రెండేళ్లుగా ఆరోగ్యం బాగాలేదు.

డీఎస్‌గా పేరుగాంచిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు ధ‌ర్మ‌పురి అర్వింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉండగా.. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు శ్రీనివాస్ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న‌ రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.

శ్రీనివాస్ 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆయ‌న‌కు ప్రత్యేక సలహాదారు పదవిని ఇచ్చి గౌర‌వించింది. ఆ తరువాత ఆయ‌న‌ను రాజ్యసభకు కూడా పంపింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల ముందు డీ శ్రీనివాస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీజేపీలో చేరిన తన కుమారుడు అరవింద్‌ను ప్రమోట్ చేశారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్పటి నుంచి శ్రీనివాస్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే కొద్ది కాలం త‌ర్వాత మార్చి 26, 2023న శ్రీనివాస్ తన కొడుకు సంజయ్‌తో కలిసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. వీల్ చైర్‌లో పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాకరే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆ మరుసటి రోజే శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడం లేదని ఆయన తరఫు ప్రకటన విడుదల చేశారు. ఆయన కేవలం తన కుమారుడిని కలిసి కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారని పేర్కొన్నారు.

శ్రీనివాస్ 1989లో కాంగ్రెస్‌లో చేరి అదే సంవత్సరం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికై మంత్రి అయ్యారు. 1999, 2004లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయ‌న‌ 1989 నుండి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రిగా.. 2004 నుండి 2008 వరకు ఉన్నత విద్య మరియు పట్టణ భూ పరిమితి మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. 2009లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పుడు ఆయన కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. అయితే 2009లో తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. శ్రీనివాస్ 2013 నుంచి 2015 మధ్య శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు.

Eha Tv

Eha Tv

Next Story