మాజీ మంత్రి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోమారు సంచ‌ల‌న ట్వీట్ చేశారు

మాజీ మంత్రి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోమారు సంచ‌ల‌న ట్వీట్ చేశారు. తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌ను టార్కెట్ చేస్తూ.. ప‌క్క రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న వాల్మీకీ స్కామ్ గురించి వ్యాఖ్య‌లు చేశారు. ఇందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక‌ను కూడా వాడారు. కేటీఆర్ ట్వీట్‌లో.. మేమన్నదే నిజమైంది. వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడింది. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును.. ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందన్నారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ.. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదం. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌కారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మద్యం కొనుగోలుకు సుమారు రూ. 20 కోట్ల నగదు బండిల్స్‌ను వినియోగించినట్లు కాంగ్రెస్‌ మాజీ మంత్రి బి. నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు విజయ్‌ కుమార్‌ గౌడ్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ ఆధారాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌ పేర్కొంది. 5,114 పేజీలతో కూడిన చార్జిషీట్‌లో 15 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని.. నాగేంద్ర, సత్యనారాయణ వర్మ (హైదరాబాద్), ఎటకారి సత్యనారాయణ (తెలంగాణ), జెజి పద్మనాభ (కార్పొరేషన్ మాజీ ఎండీ)తో పాటు మరో 20 మందిపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిందని నివేదిక పేర్కొంది.

వాల్మీకి కార్పొరేషన్‌ ఎండీగా పద్మనాభను నియమించడంతో కుట్రకు తెర‌లేపారు. ప్రధాన నిందితుడు నాగేంద్ర ఇతర అనుమానితులతో, సన్నిహితులతో ఏకాంత సమావేశాలు నిర్వహించి.. ఒక కొత్త బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు జమ చేయాలని పద్మనాభను ఆదేశించాడు. ఈ సమావేశం కార్పొరేషన్ కార్యాలయం వెలుపల జరిగిందని చార్జిషీట్ పేర్కొంది, “నాగేంద్ర, అతని సహచరులు చేసిన పెద్ద ఎత్తున నగదు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని వివరించడంలో మాజీ మంత్రి విఫలమయ్యారు. కుట్ర‌ చేయడం, సాక్ష్యాలను నాశనం చేయడం, నిధుల దుర్వినియోగం చేయడంలో నాగేంద్రది కీలక పాత్రగా చార్జిషీట్ వెల్ల‌డించింది. నాగేంద్ర నివాసం, వాల్మీకి కార్పొరేషన్ కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో దాడులు చేసిన అనంత‌రం జూలై 12న ఈడీ ఆయ‌న‌ను అరెస్టు చేసింది.

వాల్మీకి కార్పొరేషన్ అధికారి పి చంద్రశేఖరన్ మే 26న శివమొగ్గలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన తర్వాత ఈ స్కామ్ బయటపడింది. చంద్రశేఖరన్ ఆరు పేజీల సూసైడ్ నోట్‌లో స్కామ్‌తో పాటు ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి వివరించాడు. అంత‌కుముందు క్రీడలు, యువజన సర్వీసులు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర జూన్ 6న రాజీనామా చేశారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story