నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును మరో కారును ఢీకొట్టింది

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత గాయాల పాలయ్యారు. ఆమె త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం నల్లగొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ పట్టణానికి సమీపంలోని చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు సీటులో ఉన్న ఆమె ఒక్కసారిగా ముందుకు పడిపోవడంతో తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మె ల్యే లాస్యతో పాటు ఆమె సోదరి నివేదిత, డ్రైవరు, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు.

నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును మరో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్నారు. కారు వేగంగా ఢీకొట్టడంతో ఎమ్మెల్యే ఉన్న కారు ఎదురుగా ఉన్న పోలీసు సిబ్బందిపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హోంగార్డు కిషోర్ ప్రాణాలు కోల్పోయారు. మరో హోంగార్డుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన కిషోర్ నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ లాస్యనందిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నందిత తెలిపారు.

Updated On 13 Feb 2024 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story