Virat Kohli : ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు టీమిండియాను ప్రకటించనున్న సెలక్టర్లు.. కోహ్లీ ఆడుతాడా..? లేదా..?
భారత్-ఇంగ్లండ్ల మధ్య రెండో టెస్టు సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు సిరీస్లోని చివరి మూడు మ్యాచ్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
భారత్(India)-ఇంగ్లండ్(England)ల మధ్య రెండో టెస్టు సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు సిరీస్లోని చివరి మూడు మ్యాచ్లకు బీసీసీఐ(BCCI) భారత జట్టు(TeamIndia)ను ప్రకటించే అవకాశం ఉంది. భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఈరోజు సమావేశమవనున్నారు. హైదరాబాద్(Hyderabad Test) టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్.. ఇప్పటికే సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. అందువల్ల రోహిత్ శర్మ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుపై పునరాగమనం చేయాలనే ఒత్తిడి ఉంటుంది.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ తరఫున లోకేశ్ రాహుల్(Lokesh Rahul), యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రాణించగా, ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ మిస్సయ్యారు. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు రాహుల్, జడేజా గాయం కారణంగా రెండో మ్యాచ్కు దూరమయ్యారు. ఈ కారణంగానే రెండో మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraj Khan), వాషింగ్టన్ సుందర్(Washington Sundar), సౌరభ్ కుమార్(Saurabh Kumar)లను టీమ్ ఇండియాలోకి తీసుకున్నారు. రెండో టెస్టు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
సర్ఫరాజ్, సౌరభ్ తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో వీరిద్దరూ ఇండియా ఎ తరఫున మంచి ప్రదర్శన చేశారు. మరోవైపు సుందర్ చివరిసారిగా 2021లో టెస్ట్ క్రికెట్ ఆడిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
విరాట్ కోహ్లి(Virat Kohli) పునరాగమనం ఎక్కువగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్, విశాఖపట్నంలలో జరగనున్న తొలి రెండు మ్యాచ్ల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు. కోహ్లీకి సంబంధించిన పరిణామాలను వెల్లడిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటన విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో 30 ఏళ్ల రజత్ పాటిదార్(Rajath Patidar) జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో చివరి మూడు మ్యాచ్ల్లో కోహ్లి ఆడతాడా లేదా అనేది సెలెక్టర్ల సమావేశం తర్వాత తేలిపోనుంది.
ప్రస్తుతానికి సిరీస్లోని మిగిలిన మ్యాచ్లలో కోహ్లీ ఆడే విషయంపై ఎటువంటి నిర్ధారణ లేదు. భారత జట్టులో శుభ్మన్ గిల్(Shubhman Gill) స్థానంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అతడిని తొలగించే అవకాశం లేదు. భారత జట్టులోకి పునరాగమనం చేసే రేసులో చెతేశ్వర్ పుజారా ఉన్నాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న మహ్మద్ షమీ(Mohammad Shami)ని ఎంపిక చేసే అవకాశం లేదు. చివరి మూడు టెస్టులు రాజ్కోట్, రాంచీ, ధర్మశాలలో జరగనున్నాయి.