పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ జట్టు చేధించిన అత్య‌ధిక స్కోరు ఇదే.

పాకిస్థాన్(Pakistan) క్రికెట్ జట్టు ప్రపంచకప్‌(World Cup)లో చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక(Srilanka)తో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ జట్టు చేధించిన అత్య‌ధిక స్కోరు ఇదే. త‌ద్వారా ఐర్లాండ్(Ireland) 12 ఏళ్ల రికార్డును పాకిస్థాన్ బద్దలు కొట్టింది. 2011లో ఇంగ్లండ్‌(England)తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఏడు వికెట్లకు 329 పరుగులు చేసి విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్(Batting) ఎంచుకుంది. 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 344 పరుగులు చేసింది. అనంత‌రం పాకిస్థాన్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 345 పరుగులు చేసి విజయం సాధించింది. పాకిస్థాన్ తరఫున మహ్మద్ రిజ్వాన్(Rizwan), అబ్దుల్లా షఫీక్(Shafeeq) సెంచరీలు చేశారు. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని అందించారు. అంతకుముందు పాక్‌ జట్టు నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇక శ్రీలంక వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) చేతిలో ఓడింది శ్రీలంక‌.

రిజ్వాన్ 121 బంతుల్లో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫోర్ కొట్టి పాకిస్థాన్‌కు విజ‌యాన్ని అందించాడు. అంత‌కుముందు షఫీక్ 113 పరుగులతో విలువైన ఇన్నింగ్సు ఆడాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 156 బంతుల్లో 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేశారు. సౌద్ షకీల్(Shakeel) కూడా 31 పరుగులు చేశాడు. రిజ్వాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 95 పరుగులు జోడించాడు. ఇఫ్తికర్ అహ్మద్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇమామ్ ఉల్ హక్ 12 పరుగుల వద్ద అవుట్ కాగా, కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రీలంక తరఫున దిల్షాన్ మధుశంక రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (108) అద్భుత సెంచరీల సాయంతో శ్రీలంక పాకిస్థాన్‌కు 345 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ జట్టు అద్భుతమైన బౌలింగ్‌కు పేరుగాంచింది, అయితే శ్రీలంక బ్యాట్స్‌మెన్ వారి బౌలర్ల లయను చెడగొట్టారు. కుశాల్‌ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు, సదీర 89 బంతుల్లో 108 పరుగులు చేయడంతో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు చేసింది. మెండిస్ 65 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు, ఇది ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక త‌రుపున‌ ఫాస్టెస్ట్ సెంచరీ. సదీర కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. మెండిస్ వన్డేలో మూడో సెంచరీ సాధించాడు.

28 ఏళ్ల మెండిస్ ఆరు సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. అతడు పాతుమ్ నిస్సాంకతో కలిసి రెండో వికెట్‌కి 100 పరుగులు.. సమరవిక్రమతో కలిసి మూడో వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మెండిస్ ఔట్ అయిన తర్వాత.. సమరవిక్రమ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సమరవిక్రమ తన ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు బాదాడు. హసన్ అలీ (4/71) పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ (2/64), షాహీన్ షా ఆఫ్రిది (1/66) పేలవంగా బౌలింగ్ చేశారు.

Updated On 10 Oct 2023 10:47 PM GMT
Yagnik

Yagnik

Next Story