Jagannath Ratha Yatra 2023 : రేపే జగన్నాథుడి రథయాత్ర.... సర్వ సన్నద్ధమైన పూరీ క్షేత్రం
అదో అనిర్వచనీయమైన ఉత్సవం. సామూహిక సంబరం. మహానదిలా వెల్లువెత్తే భక్తి తరంగం. మదిమదిలో ఆధ్యాత్మికభావం. అణువణువునా ఉత్సాహం. అదే మహా రథోత్సవం. జగన్నాథ రథోత్సవం. ఆషాఢ శుద్ధ విదియ రోజున జరిగే అపురూప సన్నివేశం. మంగళవారం సర్వ శోభితంగా జరిగే రథయాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం! సోదరుడు బలభద్రుడు.. సోదరి సుభద్రలతో కొలువైన జగన్నాథుడి కోవెల! ఏడాదికోమారు గుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే అరుదైన సందర్భానికి సమయం ఆసన్నమయ్యింది. ఈ నెల 20వ తేదీన జరిగే ఊరిగింపు కోసం పూరీ క్షేత్రం సర్వసన్నద్ధమయ్యింది. కొత్త రథాలు ముస్తాబయ్యాయి.. ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. పూరీ ఆలయం మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ మూల విరాట్టులు ఏటా కొత్త రథంలోనే ఊరేగుతారు. అందుకే జగన్నాథ రథయాత్ర అపురూమయ్యింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం భక్తులసందోహంతో కళకళలాడుతుంటుంది. వీధులన్నీ జగన్నాథుడి నామస్మరణతో మారుమోగుతుంటాయి. భక్తులకు అది గొప్ప పర్వదినం..

Jagannath Ratha Yatra
-
- అదో అనిర్వచనీయమైన ఉత్సవం. సామూహిక సంబరం. మహానదిలా వెల్లువెత్తే భక్తి తరంగం. మదిమదిలో ఆధ్యాత్మికభావం. అణువణువునా ఉత్సాహం. అదే మహా రథోత్సవం. జగన్నాథ రథోత్సవం. ఆషాఢ శుద్ధ విదియ రోజున జరిగే అపురూప సన్నివేశం. మంగళవారం సర్వ శోభితంగా జరిగే రథయాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం! సోదరుడు బలభద్రుడు.. సోదరి సుభద్రలతో కొలువైన జగన్నాథుడి కోవెల! ఏడాదికోమారు గుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే అరుదైన సందర్భానికి సమయం ఆసన్నమయ్యింది. ఈ నెల 20వ తేదీన జరిగే ఊరిగింపు కోసం పూరీ క్షేత్రం సర్వసన్నద్ధమయ్యింది. కొత్త రథాలు ముస్తాబయ్యాయి.. ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. పూరీ ఆలయం మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ మూల విరాట్టులు ఏటా కొత్త రథంలోనే ఊరేగుతారు. అందుకే జగన్నాథ రథయాత్ర అపురూమయ్యింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం భక్తులసందోహంతో కళకళలాడుతుంటుంది. వీధులన్నీ జగన్నాథుడి నామస్మరణతో మారుమోగుతుంటాయి. భక్తులకు అది గొప్ప పర్వదినం..
-
- జగన్నాథుడి రథయాత్ర కోసం రెండు నెలల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ రోజున రథ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలవుతాయి. తేరుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. అక్షయ తృతీయ రోజున ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, 125 మంది సహాయకులు కలిసి రథ నిర్మాణం ప్రారంభిస్తారు. వచ్చిన 1072 వృక్ష భాగాలను 2188 ముక్కలుగా ఖండిస్తారు. ఇందులో 832 కలప ముక్కలను జగన్నాథుడి రథం కోసం వినియోగిస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తుండే ఈ మురళీధరుడి రథానికి పదహారు చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలతో ఉన్న పసుపు వస్త్రంతో జగన్నాథుడి రథాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. 763 ముక్కలను బలరాముడి రథ నిర్మాణం కోసం వాడతారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని పిలుస్తారు. 44 అడుగుల ఎత్తుండే ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ఇక 593 కలప ముక్కలను సుభద్ర రథానికి ఉపయోగిస్తారు. సుభద్రాదేవి ఊరేగే రథాన్ని పద్మధ్వజం అంటారు. 43 అడుగుల ఎత్తుండే ఈ రథానికి పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో ఈ తేరును ముస్తాబు చేస్తారు. ప్రతీ రథానికి 250 అడుగుల పొడవు.. ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథ నిర్మాణాలు పూర్తవుతాయి.. ఆలయ తూర్పు భాగాన ఉన్న సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ రథాలను నిలబెడతారు.
-
- విదియ రోజున ఉదయాన్నే పూజారులు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళతారు.. పూజలు చేస్తారు. శుభముహూర్తం రాగానే రత్నపీఠిక నుంచి విగ్రహాలను కదిలిస్తారు. జగన్నాథ నామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు-ఆరుణస్తంభం మీదుగా విగ్రహాలను ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. ముందుగా బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. తాళధ్వజంపై ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. తర్వాత బలరాముడి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర వస్తువులను తీసి భక్తులకు పంచిపెడతారు. ఆ తర్వాత సుభద్రాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి పద్మధ్వజంపై ప్రతిష్టిస్తారు.. అటు పిమ్మట జగన్నాథుడి విగ్రహాన్ని తీసుకొస్తారు.. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చోబెట్టే వేదికను పహాండీ అంటారు. ఈ సమయంలో ఎవరైనా జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఆలయం నుంచి విగ్రహాలను తీసుకొచ్చేవారిని దైత్యులని పిలుస్తారు.
-
- బలభద్ర, జగన్నాథ, సుభద్రల రథయాత్రకు సమయం ఆసన్నమవుతున్నప్పుడు పూరీ సంస్థానాధీశుడు వచ్చి జగన్నాథుడికి ప్రణమిల్లి, రథం మీదకు ఎక్కి, స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ ప్రక్రియను చెరా పహారా అంటారు. ఆ తర్వాత జగన్నాథుడిపై గంధం నీళ్లు చిలకరిస్తారు. కిందకు దిగి రథం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేస్తాడు. బలరామ, సుభద్రాదేవిలను కూడా ఇదే విధంగా పూజాదికాలు నిర్వహించి వారి రథాల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు.. తర్వాత రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తాడు. జగన్నాథ రథంపై ఉన్న ప్రధాన పూజారి నుంచి సూచన రాగానే రథయాత్ర మొదలవుతుంది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో యాత్ర చాలా నెమ్మదిగా సాగుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఎవరైనా పొరపాటున చక్రాల కింద పడినా రథయాత్రను ఆపరు! దారిలో షాపులు అడ్డొచ్చినా రథం ఆగదు. షాపు కూలగొట్టి రథాన్ని ముందుకు తీసుకెళతారు.. జగన్నాథుడి ఆలయం నుంచి మూడు మైళ్ల దూరంలో ఉన్న గుండీచా గుడికి రథయాత్ర చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.. అంత నెమ్మదిగా యాత్ర సాగుతుందన్నమాట! గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి రథాలను అక్కడే నిలబెడతారు.. మూలవిరాట్టులు కూడా రథంపైనే ఉంటాయి. మరునాడు ఉదయం మేళతాళాలతో ఆలయంలోకి విగ్రహాలను తీసుకెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన పిదప దశమి రోజున తిరుగు ప్రయాణం మొదలవుతుంది.. దీన్ని బహుదాయాత్రగా పిలుచుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నానికల్లా మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుంటాయి.. ఆ రోజంతా గుడి బయటే ఉంటాయి.. మరునాడు ఏకాదశి రోజున బలరామ, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను బంగారు ఆభరణాలతో ఆలంకరిస్తారు.. ఈ కార్యక్రమాన్ని సునావేష అంటారు.. ద్వాదశి రోజున విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపైకి చేరుస్తారు.. దీంతో యాత్ర పరిసమాప్తమవుతుంది.. మూడు రథాలను విరిచేస్తారు..
-
- జగన్నాథుడి రథయాత్రను ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యంగా తిలకిస్తుంది. ఇంత వైభవంగా.. ఇంత భారీగా, ఇంత ఘనంగా మరెక్కడా రథోత్సవం జరగదు కాబట్టే పూరీ రథోత్సవం జగత్ర్పసిద్ధిగాంచింది. రథయాత్ర అంటే ప్రతిఒక్కరికీ పండుగే! ఆనందపు వేడుకే! ఆ మాటకొస్తే జగన్నాథుడి ఆలయమే విశిష్టమైనది...! జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుగుతుంది..? రథోత్సవ నేపథ్యమేమిటి..? అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కథనం చెబుతారు. కంసుడిని చంపడానికి బలరామకృష్ణులు బయలుదేరిన సన్నివేశాన్ని స్ఫురణకు తేవడానికే ఈ యాత్ర జరుపుతారని కొందరు అంటారు. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి ముచ్చట తీర్చే సందర్భమే రథయాత్ర అంటారు మరికొందరు. జగన్నాథుడి రథయాత్రలో మరో విశేషం ఉంది.. తేరులలో ఊరేగే దేవుళ్లకు తెలిసో తెలియకో ఏమైనా లోటుపాట్లు చేస్తే రథం అస్సలు కదలదట! భక్తులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదట! భక్తులంతా కలిసి అపచారాన్ని మన్నించమంటూ వేడుకుని కొబ్బరికాయ కొడితే తప్ప రథం కదలదట!
-
- వైశాఖమాసంలో రథ నిర్మాణాలు మొదలవుతే, జ్యేష్ట పౌర్ణమి రోజున దేవస్నాన యాత్రలు ప్రారంభమవుతాయి. 108 బిందెల జలాలతో మూర్తులను అభిషేకిస్తారు. అంత సుదీర్ఘమైన స్నానాలను ఆచరించినందున రెండువారాలు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు దైతపతులు అనే సవరలకు తప్ప మరెవరికీ బలభద్ర, సుభద్ర, జగన్నాథుల దర్శనం లభించదు. నిత్యం 64 రకాల నైవేద్యాలను స్వీకరించే స్వాములు ఈ విశ్రాంతి సమయంలో మాత్రం కందమూలాలు మాత్రమే తీసుకుంటారు.. ఏడాది పొడుగునా ఇన్నేసి ప్రసాదాలు ఆరగించే స్వామికి ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న తలంపుతోనే నైవేద్యాలకు విరామం ప్రకటిస్తారు. రకరకాల ఆయుర్వేద ఔషధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఔషధసేవ మరే ఆలయంలో కనిపించదు.. ఇది పూరీ జగన్నాథుడికే సొంతం! అన్నట్టు పూరీ క్షేత్రంలో తప్ప ప్రపంచంలోనే ఇంత పెద్ద ఓపెన్ కిచెన్ లేదట! 500 మంది పాకశాస్త్ర నిపుణులు.. 300 మంది సహాయకులు ప్రసాదాలను తయారుచేస్తారు.. వండేదంతా నలభీములే! అంటే పురుషులేనన్నమాట! ఇక్కడ వంటలను లక్ష్మీదేవి అదృశ్యరూపంలో పర్యవేక్షిస్తుందట! ఆమె గజ్జల సవ్వడి కూడా వినిపిస్తుందట! అందుకే వంటకాలు అంత రుచికరంగా ఉంటాయట! అందుకే ఇక్కడి అర్పణాన్ని మహాలక్ష్మీపాకం అంటారు. ఒకసారి వండిన పాత్రలో మరోసారి వండరు.. ఎప్పటికప్పుడు కొత్త కుండలను ఉపయోగిస్తారు.. అవి కూడా దగ్గరలో ఉన్న కుంభారు గ్రామస్తులు చేసిన కుండలనే వాడతారు! పూరీ ఆలయ గోపురంపైన కట్టిన ధ్వజం గాలి వీస్తున్న దిశకు కాకుండా వ్యతిరేకదిశకు రెపరెపలాడటం విశేషం.. ఇక జగన్నాథ ఆలయంపైన పక్షలు అస్సలు ఎగరవు.. ఎందుకనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది.. ఇది మరో విశేషం.. పక్కనే ఉన్న సముద్రపు కెరటాల చప్పుడు ఆలయం బయట స్పష్టగా వినిపిస్తుంది.. సింహద్వారం నుంచి ఆలయంలో ప్రవేశించగానే అలల చప్పుడు ఏ మాత్రం వినిపించదు.. ఇది ఇంకో విశేషం.. గుండీచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుందట! ఇదో మిస్టరీ!
