100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని కోల్పోయిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం ఢిల్లీలో హర్యానా మాజీ సీఎం, ఎంపీ దీపేందర్ హుడాను కుటుంబ సభ్యులతో స‌హా కలిశారు

100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని కోల్పోయిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం ఢిల్లీలో హర్యానా మాజీ సీఎం, ఎంపీ దీపేందర్ హుడాను కుటుంబ సభ్యులతో స‌హా కలిశారు. దీంతో రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ త్వరలో కాంగ్రెస్‌తో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. హర్యానా ఎంపీ హుడా వినేష్‌తో కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వినేష్ శుక్రవారం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర పార్టీ నేతలను కలవబోతున్నట్లు కూడా చర్చలు జరిగాయి. గ‌తంలో రెజ‌ర్ల‌ సమ్మె సందర్భంగా ఆమె హుడాను కలిశారు. ఆ త‌ర్వాత‌ వినేష్ ఫోగట్ పారిస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి హుడా ఆమె కుటుంబంతో టచ్‌లో ఉన్నారు. ఇది వారి మూడో సమావేశం కావ‌డం విశేషం.

ఈ భేటీ తర్వాత వినేష్ ప్రియాంక గాంధీని కలవవచ్చని చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుతమైన ప్రదర్శన తర్వాత.. ప్రియాంక సోషల్ మీడియాలో వినేష్‌ను అభినందించింది. ఆమెను కలవాలని తన కోరికను వ్యక్తం చేసింది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగనుంది. అయితే గత కొద్ది రోజులుగా వినేష్ కాంగ్రెస్ లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారనే చర్చలు జరుగుతున్నాయి.

అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో వినేష్ నుంచి కానీ.. ఆమె కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. సమావేశం అనంతరం హుడా మీడియాతో మాట్లాడారు. వినేష్‌ కాంగ్రెస్‌లో చేరారనే చర్చ ఊహాజనితమని ఆయన వ్యాఖ్యానించారు. అథ్లెట్లు దేశం మొత్తం ఉన్నారని అన్నారు. ఎవరైనా పార్టీలో చేరితే అది తెలిసిపోతుంది. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తున్నాం.. కానీ వినేష్‌కు అన్యాయం జరిగిందన్నారు. ఆమెకు తగిన గౌరవం లభించాలి. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన వారికి ఇచ్చే గౌరవం ప్రభుత్వం తనకు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేసినట్లే వినేష్‌ను కూడా రాజ్యసభకు నామినేట్ చేసి ఉండాల్సిందని అన్నారు. ఆమెకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగలేదన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story