అన్న కోసం పోలీస్‌స్టేషన్‌ ఎదుట చెల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది.

అన్న కోసం పోలీస్‌స్టేషన్‌ ఎదుట చెల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. అరెస్ట్ చేసిన తన అన్నను విడుదల చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేయగా వారిలో ఒకరు మరణించారు. మరొక చెల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్‌ (32)కు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.

దినేష్‌ బంధువు ఒకరు ఏప్రిల్‌ 8వ తేదీన మరణించాడు. దినేష్‌ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్‌ వద్ద సంతాప కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే నడుక్కవేరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను బైక్‌పై నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అది చూసి దినేష్‌ చెల్లెళ్లు కూడా పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లారు. పోలీసులు తమ అన్నపై తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపించారు.

దినేష్‌ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్‌లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేశారు. సోదరీమణులను పోలీసులు దూషించి బయటకు పంపించారని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆ చెల్లెళ్లు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చుకొని నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీంతో దినేష్ బంధువులు తంజావూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.నడుక్కావేరి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్‌ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ehatv

ehatv

Next Story