ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌(BDS) వంటి మెడికల్‌ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2014 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌(BDS) వంటి మెడికల్‌ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2014 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను (Grace Marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు(Supreme Court) తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు రావడమే అనుమానాలకు దారి తీసింది. నీట్‌ పరిక్ష నిర్వహణ, ఫలితాలలో అవకతవకలు జరిగాయన్నది విద్యార్థుల ఆరోపణ. దీనిపై సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

హర్యానాలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చిందని, గోల్‌మాల్‌ జరిగిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అయితే ఎన్డీయే డీజీ సుబోధ్‌కుమార్‌ వర్షన్‌ మరోలా ఉంది. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్‌ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా మార్కులు సాధించడానికి కారణమంటున్నారాయన. మరోవైపు అవకతవకల ఆరోపణలపై స్పందించి కేంద్ర విద్యాశాఖ గతవారం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటి గ్రేస్‌ మార్కులు పొందిన విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించింది. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

వారికి రీ-టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చెప్పింది. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుందని, ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. ఇదలా ఉంటే ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సెలింగ్‌ యథాతథంగా జరుగుతుందని సుప్రీం తెలిపింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షను దాదాపు 24 లక్షల మంది రాశారు. అయితే ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్‌ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వచ్చాయి. ఇప్పటివరకు నీట్‌ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్‌ స్కోరు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన వారు ఆరుగురు ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story