ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ద‌ర్యాప్తు సంస్థ‌లు అరెస్టు చేయ‌గా..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ద‌ర్యాప్తు సంస్థ‌లు అరెస్టు చేయ‌గా.. తన అరెస్టును కేజ్రీవాల్ కోర్టులో సవాల్ చేశారు. త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలని పిటీష‌న్‌లో విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అంతకుముందు సోమవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై ముందస్తు విచారణకు సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది.

కేజ్రీవాల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 20 వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసులో సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలకు బెయిల్ మంజూరైంది.

సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉండటం గమనార్హం. సీబీఐ అరెస్టును రద్దు చేయాలన్న కేజ్రీవాల్‌ డిమాండ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న తిరస్కరించి బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

మనీలాండరింగ్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ లభిస్తే జైలు నుండి బయటపడతారు. మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. కేజ్రీవాల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి సిబిఐ అరెస్టును సవాలు చేస్తూ.. మరొకటి బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story