మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే అని పిలువబడే ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది.

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే అని పిలువబడే ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కడ్వంచి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్ల‌డించారు. బాధితులు ముంబై, బుల్దానా జిల్లాలోని మలాద్ (తూర్పు) నివాసితులని పోలీసులు తెలిపారు.

“నాగ్‌పూర్ నుండి ముంబైకి వెళ్తున్న MUV వాహ‌నం, ఎదురుగా వెళ్తున్న‌ కారు ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు” అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కార్లు బ‌లంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జ‌య్యాయి. MUV క్రాష్ బారియర్‌ను ఛేదించి రోడ్డుకు ఎడమ వైపు పడిపోయింది. స్థానిక గ్రామస్తులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలలో చిక్కుకున్న వారిని రక్షించే ప్ర‌య‌త్నం చేశారు.

ఆరు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు జాల్నాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఉమేష్ జాదవ్ తెలిపారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు, తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (జిఎంసిహెచ్)కి తరలించిన తరువాత మరణించాడని వెల్ల‌డించారు.

మృతుల్లో ముగ్గురు ముంబైకి చెందిన వారు కాగా, పలువురు బుల్దానా జిల్లాకు చెందిన వారు. ఛత్రపతి సంభాజీనగర్‌కు తరలించిన ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story