కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఓడిపోతే ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) భారతీయ జనతా పార్టీ(BJP)కి జీవన్మరణ సమస్యగా మారాయి. ఓడిపోతే ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.. అందుకే ఎలాగైనా సరే కర్ణాటకలో గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. సర్వే నివేదికలేమో బీజేపీకి అంత సీన్ లేదని చెబుతున్నాయి. అందుకే ఈసారి సినీ గ్లామర్ను వాడుకోవాలనుకుంటోంది కమలం పార్టీ. కన్నడ స్టార్ హీరోలు సుదీప్(Sudeep), దర్శన్లను(Darshan) పార్టీలోకి సాదరంగా ఆహ్వానించింది.
సుదీప్(Sudeep), దర్శన్(Darshan)లు బీజేపీ(BJP)లో చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) సమక్షంలో వీరిద్దరు బీజేపీ కండువాలు వేసుకోబోతున్నారు. అలాగే పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా వీరిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారట. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కిచ్చా సుదీప్ పరిచయం. ఈయన నాయక సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఎస్టీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్కు బీజేపీ కొత్త కాదు. గతంలో కూడా బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. 2020లో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం ప్రచారం చేశాడు దర్శన్. అంబరీష్ చనిపోయిన తర్వాత మాండ్యా లోక్సభకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు దర్శన్ మద్దతు పలికాడు. ఆ తర్వాత సుమలత బీజేపీలో చేరారు. మరి ఈ ఇద్దరు హీరోలు బీజేపీకి ఎన్ని ఓట్లు తెచ్చిపెడతారో చూడాలి.