కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Rains) కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లో వరదలు పోటెత్తుతున్నాయి

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Rains) కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మనాలి-లేహ్ జాతీయ రహదారితో స‌హా 87 ఇతర రహదారులు మూసివేశారు. రానున్న మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్(Orange Alert) ప్రకటించింది.

భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్(Chandrbhag River) నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు పోటెత్తాయి. జింగ్ జింగ్‌బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి 3పై భారీ వ‌ర‌ద నీటితోపాటు శిధిలాలు ఉన్నాయి. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దర్చా, సర్చు పోలీసు చెక్‌పోస్టు(Police Check Post)ల వద్ద ట్రాఫిక్‌(Traffic) నిలిపేశారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) హైవే నుండి చెత్తను తొలగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రా, హమీర్‌పూర్, చంబా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణం కారణంగా రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఎల్లో అలర్ట్(Yellow Alert) ప్రకటించారు.

కేదార్‌నాథ్(Kedarnath) నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, స్థానిక ప్రజలను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. 645 మంది ప్రయాణికులు, స్థానిక ప్రజలను Mi-17, చినూక్, ఇతర హెలికాప్టర్ల ద్వారా.. 584 మందిని కాలినడకన, 172 మందిని భీంబాలి-లించోలి-చౌమాసి మార్గంలో తరలించారు. ఐదు రోజుల్లో 11,775 మంది ప్రయాణికులను రక్షించారు.

గుజరాత్‌(Gujarat)లోని నవ్‌సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవ్‌సారి జిల్లా ఖేర్గాం తాలూకాలో సోమవారం ఉదయం 6 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 229 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వల్సాద్ జిల్లాలో ఔరంగ్ నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story