ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై మాట్లాడనున్నట్లు తెలుస్తుంది

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ దిగువసభలో ప్రసంగించాలని.. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రసంగం గొప్ప ప్రభావాన్ని చూపుతుందని కాంగ్రెస్ ఎంపీలు భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ మేరకు ఆయన ఈరోజు ఉదయం నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను ఇప్పటికే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాట్లాడానని.. ప్రతిసారీ తానే మాట్లాడే బదులు ఇతరులకు అవకాశం ఇస్తే.. వారు మాట్లాడాతార‌ని తాను నమ్ముతున్నానని అన్నారు.

మంగళవారం సమర్పించిన కేంద్ర బడ్జెట్‌పై అధికార భారతీయ జనతా పార్టీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది 'భారత సమాఖ్య నిర్మాణం యొక్క గౌరవం'పై దాడి అని అన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయన ఒక పోస్ట్‌లో.. 'ఈ బడ్జెట్ భారతదేశ సమాఖ్య నిర్మాణం యొక్క గౌరవంపై దాడి - అధికారాన్ని కాపాడుకోవాలనే దురాశతో.. దేశంలోని ఇతర రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారు. వివక్ష చూపారన్నారు.

శుక్రవారం పార్లమెంటు కాంప్లెక్స్‌లో బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి నిరసనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు మాత్రమే ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని అన్నారు. ఇంత బడ్జెట్‌ను ఎప్పుడూ ప్రవేశపెట్టలేదని ఖర్గే అన్నారు. జేడీయూ, టీడీపీల మద్దతుపై ఆధారపడిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఇది జరిగిందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story