ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది

ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంకజ్ త్రిపాఠి బావ మరణించగా, ఆయన సోదరి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పంకజ్ త్రిపాఠి బావ రాకేష్ తివారీ మరణించగా, అతని సోదరి సబితా తివారీ గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారి-2లోని నిర్సా బజార్ వద్ద సాయంత్రం 4.30 గంటల సమయంలో దంపతులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా నుంచి దంపతులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరారు.

వీరిద్దరినీ ధన్‌బాద్‌లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (SNMMCH)కి తరలించారు. అక్కడ వైద్యులు రాకేష్ తివారీ అప్పటికే చనిపోయారని ప్రకటించారు. కాలు ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న పంకజ్ త్రిపాఠి సోదరి ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. రాకేష్ తివారీ స్వయంగా కారు నడుపుతుండగా అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 21 April 2024 12:04 AM GMT
Yagnik

Yagnik

Next Story