ఆయనది ప్రతేకమైన బాణి. ఆయనెప్పుడూ ఇంకొకరిని అనుకరించలేదు. ఆయనలా తర్వాత మరొకరు బాణీలు కట్టలేదు. అఅందుకే ఆయన పాటను సునాయసంగా గుర్తుపట్టవచ్చు. తెలుగు సినీ సంగీతానికి ఆయనో వరం. ఆయనే ఎస్‌.పి.కోదండపాణి (kodandapani).
ఎస్‌.పి.కోదండపాణి(S. P. Kodandapani)కి జానపద చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే గుర్తింపు వచ్చింది కానీ ఆయన అన్ని రకాల పాటలను చేశారు. వాటిని జనరంజకం చేశారు. గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని(s.p.balasubrahmanyam) పరిచయం చేసిన ఘనతే కాదు, నిజం చెప్పాలంటే ఎస్పీ కోదండపాణిలో అంతకు మించిన ఘనతలు చాలానే ఉన్నాయి.

ఆయనది ప్రతేకమైన బాణి. ఆయనెప్పుడూ ఇంకొకరిని అనుకరించలేదు. ఆయనలా తర్వాత మరొకరు బాణీలు కట్టలేదు. అఅందుకే ఆయన పాటను సునాయసంగా గుర్తుపట్టవచ్చు. తెలుగు సినీ సంగీతానికి ఆయనో వరం. ఆయనే ఎస్‌.పి.కోదండపాణి (kodandapani).
ఎస్‌.పి.కోదండపాణి(S. P. Kodandapani)కి జానపద చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే గుర్తింపు వచ్చింది కానీ ఆయన అన్ని రకాల పాటలను చేశారు. వాటిని జనరంజకం చేశారు. గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని(s.p.balasubrahmanyam) పరిచయం చేసిన ఘనతే కాదు, నిజం చెప్పాలంటే ఎస్పీ కోదండపాణిలో అంతకు మించిన ఘనతలు చాలానే ఉన్నాయి. తెలుగుపాటకు వేగం పెంచిన వారిలో కోదండపాణి ఒకరు. అలాగని ఆయన మెలోడీకి ఎప్పుడూ దూరం కాలేదు.. ఆయన హుషారు పాటలు, శృంగార పాటలు, విషాద గీతాలు, భక్తి గీతాలు అన్నీ చేశారు. అన్నింటిలోనూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.

సంగీత దర్శకుడిగా కోదండపాణికి మొదటి సినిమా కన్నకొడుకు. 1961లో వచ్చిందీ సినిమా. రెండేళ్ల తర్వాత గురువును మించిన శిష్యుడు(guruvunu minchina shishyudu) చిత్రం వచ్చింది. ఈ సినిమా కోదండపాణికి చాలా మంచి చేసింది. దాంతో పాటు కాసింత చెడు కూడా! ఈ సినిమాలోని ఏడేడు జన్మల నుండీ పడివుందీ బ్రహ్మముడి, బలె బలె బలె హిరణ్యకశపుడిరా నిన్ను ఇరుచుకుతింటారా,..వెన్నెల్లో కనుగీటేతారక వంటి పాటలను ప్రేక్షకులు మరీ మరీ విన్నారు. విని విని ఆనందపడ్డారు. కానీ ఈ సినిమా కోదండపాణిపై ఓ ముద్ర చేసింది. గురువును మించిన శిష్యుడు తర్వాత జానపద చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే గుర్తింపు వచ్చింది. విఠలాచార్యాలా. ఒక్కసారి ఓ ఇమేజ్‌ వచ్చాక దాన్నుంచి బయటపడటం ఒకింత కష్టమే... పాపం కోదండపాణికీ ఇది తప్పలేదు. అయితేనేం. వాటిల్లోనూ తనదైన మార్క్‌ను చూపించారు. ఇక బంగారు తిమ్మరాజు, తోటలోపిల్ల కోటలో రాణి, ఆకాశరామన్న, జ్వాలాదీప రహస్యం, భూలోకంలో యమలోకం, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, ఇద్దరు మొనగాళ్లు, గోపాలుడు-భూపాలుడు, మహాబలుడు..ఇలా జానపద చిత్రాలు వరుసపెట్టి వచ్చాయి. వాటిల్లో అందమైన వరసలతో బాణీలు కట్టి వారెవ్వా కోదండపాణి అనిపించుకున్నాడు.

సాంఘిక చిత్రాలలోనూ కోదండపాణిది స్పెషల్‌ స్టయిల్‌. ప్రతి పాటలో ఆయన మార్క్‌ కొట్టొచ్చినట్టు కనబడేది. చెవులకు ఇంపుగా వినబడేది. దేవత (devatha)సినిమా పాటలే ఇందుకు మంచి ఉదాహరణ.
సుఖదు:ఖాలు, ఇంటిగౌరవం, మంచి కుటుంబం, మా మంచి అక్కయ్య, మంచి మిత్రులు, కీలుబొమ్మలు, ఆస్తులు అంతస్తులు, ఒకే కుటుంబం, శాంతి నిలయం, పండంటి కాపురం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు..
కోదండపాణి చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. విషాద గీతాలకే తప్ప శృంగార గీతాలకు అంతగా ఉపయోగించని శివరంజని రాగచ్ఛాయలలో నేనంటేనేనేలోని చాలదా ఈ చోటు పాటను, ఆస్తులు అంతస్తులులోని ఒకటై పోదామా ఊహల వాహినిలో పాటను స్వరపరచి ఔరా అనిపించుకున్నాడు. ఎవరూ అంతగా ముట్టుకోని సరస్వతి రాగాన్ని శ్రీరామకథ సినిమాలోని సర్వ కళాసారాము పాటకు ఉపయోగించి శాస్త్రీయ సంగీతంలో తన పట్టును నిరూపించుకున్నాడు. అలాగే కళ్యాణ వసంత రాగంలో అదే సినిమాలోని మాధవా..మాధవా పాటను స్వరపరిచారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో ఏమీ ఈ వింత మోహం అన్న పాటలో వచ్చే నా హృది పయనించు శృంగార రథమా అన్న
చరణానికి కామవర్ధని రాగాన్ని వాడారాయన. భాగేశ్రీ, కళ్యాణి రాగాలను కలగలిపి కథానాయిక మొల్లలోని దొరవో ఎవరివో పాటను కంపోజ్‌ చేసి ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం అనే గొప్ప గాయకుడిని మొదటిసారిగా పరిచయం చేసింది కోదండపాణే! అంతే కాదు జేసుదాసు(jesudas) తో మొట్టమొదటిసారిగా తెలుగులో పాడించింది కూడా ఈయనే!

నటుడైన పద్మనాభంతో దేవతలో నాపేరు దాందాసు... పాటను పాడించారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రేలంగి(relangi)తో మళ్లీ పాట పాడించిన ఘనత కూడా కోదండపాణిదే.
ఈలపాటి రఘురామయ్యతో మొదటిసారిగా వేరే నటుడికి ప్లేబ్యాక్‌ పాడించారు. అది కూడా హీరో కృష్ణ(hero krishna)కు కావడం విశేషం. అలాగే గాయనీగాయకులకు చిరస్మరణీయంగా నిలిచిపోయే పాటలను అందించారు. బంగారు తిమ్మరాజు సినిమాలో నాగమల్లి కోనలోన పాట జమునారాణికి ఆల్‌టైమ్‌ బెస్ట్‌గా నిలిచింది. అదే సినిమాలో జేసుదాసు పాడిన నిండు చందమామ పాట ఆయన టాప్‌టెన్‌లో ఒకటిగా నిలిచింది. సుఖదుఃఖాలులోని ఇది మల్లెల వేళయని పాట సుశీలకు, ఆకాశరామన్న సినిమాలోని రిపనిద పమగరి లోకం నవ్విన నవ్వనీ పాట జానకికి, శాంతినిలయంలో దేవి క్షేమమా పాట వసంతకు, దేవత సినిమాలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి పాట, ఒకే కుటుంబంలోని మంచిని మరచి పాట ఘంటసాలకు, శ్రీరామకథలోని రామకథ శ్రీరామకథ, సుఖదుఃఖాలులోని మేడంటే మేడా కాదు పాటలు బాలుకి, ఆస్తులు అంతస్తులు సినిమాలోని రేగిపళ్లు పాట, నేనంటేనేనేలోని అంబవో శక్తివో పాట ఎల్‌.ఆర్‌.ఈశ్వరికి మైలురాళ్లుగా నిలిచాయి. పి.లీల సంగీతాన్ని అందించిన చిన్నారి పాపలు సినిమాకు సంగీత పర్యవేక్షణ చేసింది ఎస్‌.పి.కోదంపాణినే!
గుంటూరులో కోదండపాణి జన్మించారు. ఆయన బాల్యమంతా అక్కడే గడించింది. చిన్నప్పుడే పాటలు, పద్యాలు చక్కగా పాడేవారు. కోదండపాణిలోని సంగీత తృష్ణను గమనించిన ఇంట్లోవాళ్లు ఆయనకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాస్‌కు వెళ్లారు కోదండపాణి. అద్దేపల్లి రామారావు సంగతదర్శకత్వంలో వచ్చిన నా ఇల్లు సినిమాలో కోరస్‌ పాడారు. అటు పిమ్మట సుసర్ల దక్షిణామూర్తి దగ్గర సహాయకుడిగా చేరారు. సంతానం సినిమాలో ఓ పాట కూడా పాడారు కోదండపాణి. చాన్నాళ్ల తర్వాత పండంటి కాపురం సినిమాలో ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే పాట పాడారు.. కె.వి. మహదేవన్‌ దగ్గర కూడా కొంతకాలం పని చేశారు. కన్నకొడుకు సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యారు. ఆనాటి హీరోలందరి సినిమాలకు సంగీతం ఇచ్చారు కోదండపాణి . అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి కుటుంబం సినిమాకు కోదండపాణినే మ్యూజిక్‌. అయితే అందులో నాగేశ్వరరావుకు పాటలు లేకపోవడం గమనార్హం. మొత్తం 101 సినిమాలకు సంగీతాన్ని అందించిన కోదండపాణి 42 ఏళ్ల వయసులోనే 1974, ఏప్రిల్‌ అయిదున కన్నుమూశారు.

Updated On 5 April 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story