టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ సంస్థల ప్రాజెక్టులను ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబు మొత్తం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది, ఇందులో రూ.3.4 కోట్లు చెక్ ద్వారా, రూ.2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలు చట్టవిరుద్ధమైనవి కావచ్చని ఈడీ అనుమానిస్తోంది.

మహేష్ బాబును ఈ నెల 27 లేదా 28న విచారణకు హాజరుకావాలని ఈడీ(ED) ఆదేశించింది. ఈ కేసు సాయి సూర్య డెవలపర్స్(Sai Surya Developers), సురానా గ్రూప్‌ల(Surana Group)పై తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌(FIR)ల ఆధారంగా నమోదైంది. ఈ సంస్థలు అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లను విక్రయించడం, ఒకే ప్లాట్‌ను బహుళ వ్యక్తులకు విక్రయించడం, నకిలీ రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహేష్ బాబు (Mahesh Babu)ఈ ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు ఆకర్షితులైనట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం, మహేష్ బాబు ఈ మోసాల్లో నేరుగా పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, కేవలం అతను స్వీకరించిన చెల్లింపులను మాత్రమే ఈడీ పరిశీలిస్తోందని సమాచారం. ఈ నెల 16న ఈడీ హైదరాబాద్‌(Hyderabad)లోని సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాలు, అధినేతల నివాసాలపై దాడులు చేసి, పెద్ద మొత్తంలో నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఈడీ నోటీసుల విషయంలో అతని బృందం నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Updated On 22 April 2025 5:41 AM GMT
ehatv

ehatv

Next Story