తెలుగు, తమిళ ప్రజల మరిచిపోలేని మహానటి సావిత్రి. 100 సంవత్సరాల్లో సావిత్రికి వచ్చిన పేరు మరే నటుడు, నటికి రాలేదనేది అక్షర సత్యం.

తెలుగు, తమిళ ప్రజల మరిచిపోలేని మహానటి సావిత్రి. 100 సంవత్సరాల్లో సావిత్రికి వచ్చిన పేరు మరే నటుడు, నటికి రాలేదనేది అక్షర సత్యం. ఒకానొక సందర్భంగా ఎన్టీ రామారావు కూడా ఆమె నటనకు ముగ్ధుడై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఆమె గొప్పతనానినికి నిదర్శనం. 'సావిత్రితో నటించడం గొప్ప అనుభవం.. ఆమెను నేను అందుకోగలనా అని భయపడ్డానంటూ ఎన్టీఆర్ ప్రశసించడం విశేషం. తమిళ స్టార్ శివాజీ గణేషన్ కూడా సావిత్రి పక్కన నటించాలంటే దడుసుకునేవారు. సావిత్రి నటించిన మాయాబజార్ సినిమా అత్యుత్తమ భారతీయ సినిమాగా నిలిచింది. ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ మాయాబజారులో డ్యూయెట్లు పాడిన నేను హీరో కానే కాదు.. కృష్ణుడి పాత్ర వేసిన రామారావు కూడా హీరో కాదు, ఘటోత్కచుని పాత్ర వేసిన ఎస్.వి. రంగారావు కూడా హీరో కాదు. మాయాబజార్లో నిజమైన హీరో ఎవరంటే... సావిత్రి అని ఆయన అన్నారు. ఆ సినిమా చూసిన రాజ్కపూర్ ఇలాంటి సినిమా వందేళ్ల వరకు రాదాని అన్నారు. ఈ విశ్వంలో మానవాళికి ... ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం! ఈ సినిమా ప్రపంచానికి ఒకే సావిత్రి అని నాగేశ్వరరావుతో బాపు, రమణ అన్నారట.
డిసెంబర్ 6, 1935న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో సావిత్రి జన్మించారు. ఆరు నెలల వయస్సులోనే తండ్రి నిశ్శంకర గురవయ్య మరణించారు. కొంత కాలం నాటకాల్లో నటించిన తర్వాత సినిమాల కోసం ఆ కుటుంబం మద్రాస్కు తరలివెళ్లింది. 1951లో నటుడు, నిర్మాత, దర్వకుడు అయిన కోన ప్రభాకర్రావు దర్శకత్వం వహించిన ‘రూపవతి’ నటనాపరంగా సావిత్రికి మొదటి చిత్రం. 1952లో ‘పెళ్లిచేసి చూడు' ఆ తర్వాత తమిళ సినిమా ‘కళ్యాణం పన్నిపార్’ సావిత్రిని సినిమా రంగంలో నిలబెట్టాయి. ఇక ఆ తర్వాత 1953లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు తిరుగులేకుండా పోయింది. 1952లో సావిత్రిని జెమినీ గణేషన్ మద్రాస్లోని చాముండేశ్వరి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల వరకు ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియనివ్వలేదరు సావత్రి. జెమినీ గణేషన్తో అప్పటికే పెళ్లి కావడంతో తన తల్లి, పెదనాన్న ఒప్పుకోరని పెళ్లి విషయం బయటకు చెప్పకుండా జాగ్రత్త పడింది. కొన్నేళ్ల తర్వాత లక్స్ సబ్బు ప్రకటన కోసం సావిత్రి గణేశ్ అని సంతకం చేయడంతో వీరి పెళ్లి విషయం బయటకు తెల్సింది.
సావిత్రి-జెమినీ గణేషన్కు విజయ చాముండేశ్వరి, శ్రీరామ నారాయణ సతీష్కుమార్ అనే సంతానం. విజయ చాముండేశ్వరి మద్రాసులో, సతీశ్కుమార్ అమెరికాలోనూ స్థిరపడ్డారు. కొన్నేళ్ల వరకు వీరి కాపురం సవ్యంగా సాగినా జెమినీ గణేశన్ నిరాదరణతో సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది. దీంతో ఆమె ఒంటరిగా భావించారు. డబ్బును దానం చేయడం, కొంత వ్యసనాలకు లోనై చాలా ఆస్తులను ఆమె పోగొట్టుకున్నారు. ఆయితే ఆమె చివరి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సమాధిపై ఉంచే సంస్మరణ ఫలకం మీద చెక్కే వ్యాక్యాలు ఎలా ఉండాలో తెలిపారు. 'జీవితంలో, మరణంలో మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతోంది' అని రాయాలన్నారు. ఆమె జయంతి సందర్భంగా..
'సావిత్రి అమర్ రహే.. జోహార్ సావిత్రి.. జోహార్.. జోహార్..!
