నేను ఇంటికి ఆహారం తీసుకువెళుతుండగా, నలుగురు వ్యక్తులు నన్ను కార్నర్ చేసి కొట్టి

అమెరికాలోని చికాగోలో భారతీయ విద్యార్థిపై మారణాయుధాలను చేతబట్టిన వ్యక్తులు దాడి చేసి అతని ఫోన్ దోచుకున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అతనికి సరైన వైద్యం అందేలా చూడాలని అతని కుటుంబం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ABC7Chicagoలోని ఒక నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 4న అతని వెస్ట్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ సమీపంలో సాయుధ దొంగలు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అలీకి గాయాలు అయ్యాయి.ఈ దాడిలో మజర్ అలీ రక్తసిక్తమయ్యాడు. పలుచోట్ల గాయాలయ్యాయి. కళ్లపై ముష్టిఘాతాలు కురిపించారని, ముఖం, ఛాతి, వీపుపై ఇష్టారీతిన తన్నారని చెప్పాడు. ఫోన్‌తో పాటు వాలెట్ కూడా తీసుకుని వెళ్లిపోయారని అన్నాడు.

అతడి మీద దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అలీ ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పడం వినవచ్చు. "నేను ఇంటికి ఆహారం తీసుకువెళుతుండగా, నలుగురు వ్యక్తులు నన్ను కార్నర్ చేసి కొట్టి, నా ఫోన్‌తో పారిపోయారు. దయచేసి నాకు సహాయం చేయండి" అని అలీ వీడియోలో కోరాడు. హైదరాబాద్‌లోని అలీ కుటుంబం, అతని భార్య, ముగ్గురు మైనర్ పిల్లలతో సహా అతని గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా వెళ్లేందుకు సహాయం అందించాలని ఆయన భార్య విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను సంప్రదించారు. చికాగోలోని భారత కాన్సులేట్ మంగళవారం మాట్లాడుతూ, తాము అలీ, అతని భార్యతో టచ్‌లో ఉన్నామని, ఈ విషయంలో వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు.

Updated On 6 Feb 2024 10:23 PM GMT
Yagnik

Yagnik

Next Story