సాహసయాత్ర విషాదాంతంగా ముగిసింది. సముద్రగర్భంలో సాహసికులు మృత్యువాత పడ్డారు. వందేళ్ల కిందట అట్లాంటిక్‌ మహా సముద్రం(Atlantic Ocean)లో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన వారు సముద్రగర్భంలోనే కలిసిపోయారు. ప్రపంచ దేశాలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. దాదాపు అయిదు రోజుల పాటు వారి ఆచూకి కోసం చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. అమెరికా కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీమ్‌లు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయ. బుధవారం నుంచి క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఈ అన్వేషణ […]

సాహసయాత్ర విషాదాంతంగా ముగిసింది. సముద్రగర్భంలో సాహసికులు మృత్యువాత పడ్డారు. వందేళ్ల కిందట అట్లాంటిక్‌ మహా సముద్రం(Atlantic Ocean)లో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన వారు సముద్రగర్భంలోనే కలిసిపోయారు. ప్రపంచ దేశాలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. దాదాపు అయిదు రోజుల పాటు వారి ఆచూకి కోసం చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. అమెరికా కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీమ్‌లు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయ. బుధవారం నుంచి క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఈ అన్వేషణ చివరకు మినీ సబ్‌మెరిన్‌ శకలాల గుర్తింపుతో విషాదాంతంగా ముగిసింది. టైటాన్‌లో ఉన్న అయిదుగురు చనిపోయారని వారి కుటుంబసభ్యులకు వర్తమానం పంపింది యుఎస్‌ కోస్ట్‌ గార్డ్‌.. యుఎస్‌ కోస్ట్‌గార్డ్‌, రెస్క్యూ సిబ్బంది తరపున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నామని రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ మౌగర్‌ తెలిపారు. టైటాన్‌లో ప్రయాణించిన అయిదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులని, ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగి ఉన్నారని, ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే తమ ఆలోచనలు ఉన్నాయని ఓషన్‌ గేట్‌ సంస్థ తెలిపింది. టైటానిక్‌ శకలాల దగ్గరే ఓడ ముందుభాగం నుంచి సుమారు 16 వందల అడుగుల దూరంలో టైటాన్‌ శిథిలాలు పడి ఉన్నాయని యుఎస్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌ వీటిని గుర్తించినట్లు తెలిపింది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి అయిదుగురితో కూడిన టైటాన్ సాహసయాత్ర మొదలయ్యింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్‌ నౌక శకలాలను వీక్షించడానికి వీరు బయలుదేరారు. ప్రయాణికులలో పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారవేత్త షెహజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమన్‌ దావూద్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఉన్నారు. పోలార్‌ ప్రిన్స్‌ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్‌. న్యూఫౌండ్‌ల్యాండ్‌ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్‌ మాయమై ఉటుందని కోస్ట్‌గార్డ్‌ భావించింది. ఆ క్షణం నుంచే అన్వేషణను మొదలు పెట్టింది. సుమారు 13 వేల అడుగుల లోతులో టైటాన్‌ ఆచూకి కనిపెట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని.. అయినప్పటికీ అయదుగురి ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా అన్వేషించింది. Catastrophic Implosion అంటే తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్‌ పేలిపోయి ఉంటుందని యుఎస్‌ కోస్ట్‌గార్డ్‌ భావిస్తోంది. ఛాబర్‌లోని ఒత్తడి వల్లే మినీ సబ్‌మెర్సిబుల్‌ పేలిపోయి ఉంటుందని తెలిపింది. మినీ సబ్‌మెర్సిబుల్‌ విషయంలోనే కాదు, సబ్‌మెరిన్‌ల విషయంలోనూ ఇలా తీవ్రమైన పీడనం పెరగడం వల్ల పేలిపోయే అవకాశం ఉందని. అధిక అంతర్గత పీడన కారణంగా సబ్‌మెరిన్‌లు ఒక్కోసారి ఆగిపోవడం, నీటి అడుగుకు వెళ్లిపోవడం జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని చెబుతున్నారు. టైటాన్‌ కూడా అలాగే పేలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. టైటాన్‌లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలే ఉండటంతో గురువారం నుంచి టెన్షన్ మొదలయ్యింది. భారత కాలమాన ప్రకారం గురువారం సాయంత్రం 7.15 గంటల వరకు ఆక్సిజన్‌ సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు. రెండు రోజుల నుంచి టైటాన్‌ అదృశ్యమైన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించడంలో ఆశలు చిగురించాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడ వెతికినా టైటాన్‌ జాడ మాత్రం కనిపించలేదు. అయితే ఆ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవి కావని తర్వాత ప్రకటించింది. ఆ క్షణం నుంచి ఉత్కంఠ పెరిగింది. అయిదుగురు ప్రాణాలతో బయటపడాలని నిఖిలజగతి ప్రార్థించింది. కానీ ప్రార్థనలు ఫలించలేదు. అయిదుగురు జలసమాధి అయ్యారు.

ఓషన్‌ గేట్‌ అన్నది వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ. స్టాక్‌టన్‌ రష్‌, గుయిలెర్మో సోమ్‌నలెయిన్‌లు 2009లో దీనికి స్థాపించారు. సముద్ర అంతర్భాగంలో పర్యటనలతో పాటు అన్వేషణలు, పరిశోధనలు ఓషన్‌గేట్‌ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఇందుకు బాగానే ఛార్జ్‌ చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్‌ శకలాలను చూడటానికి టైటాన్‌ అనే సబ్‌ మెర్సిబుల్‌ ద్వారా యాత్రికులను తీసుకెళుతోంది. ఈ సాహస పర్యటన అంత ఆషామాషీ కాదు. డబ్బుంటే సరిపోతు. టన్నుల కొద్దీ గుండె ధైర్యం కూడా ఉండాలి. 400 మైళ్ల దూరం గుండె దిటవు చేసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్‌లో ముగ్గురు ప్రయాణికులు, ఓ పైలట్‌, మరో ఎక్స్‌పర్ట్‌.. ఇలా మొత్తం అయిదుగురు ప్రయాణించే అవకాశం ఉంది. వాళ్లకు తగినట్టే సీటింగ్‌ ఉంటుంది. దాదాపు అరున్నర మీటర్ల పొడవు ఉన్న ఈ మినీ సబ్‌మెర్సిబుల్‌ 10, 431 కిలోల బరువు ఉంటుంది. సబ్‌మెర్సిబుల్‌ గోడలను కార్బన్‌, టైటానియంలతో తయారు చేశారు. సోనార్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌, హైఎండ్‌ కెమెరా ఎక్విప్‌మెంట్‌, పవర్‌ఫుల్‌ ఎల్‌ఈడీ లైట్లను ఇందులో ఏర్పాటు చేశారు. కాకపోతే టైటాన్‌లో ఒకే ఒక్క డోర్‌ ఉంది. లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఇదే దారి. ఈ సబ్‌మెర్సిబుల్‌ నాలుగు వేల మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఇప్పుడు టైటాన్‌లో వెళ్లిన యాత్రికులు ఒక్కొక్కరు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రెండు కోట్ల రూపాయలకు పైనే! అట్లాంటిక్‌ అగాధంలోకి వెళ్లేందుకు టైటాన్‌ నిర్మాణం పనికిరాదని, కీడు జరిగే అవకాశం ఉందని ఎప్పట్నుంచో నిపుణులు చెబుతున్నారు. ఓషన్‌గేట్‌ మాత్రం వీటిని పట్టించుకోకుడా యాత్రలు నిర్వహిస్తూనే ఉంది. టైటాన్‌ను ఆపరేట్‌ చేయడానికి ఉపయోగించే రిమోట్‌ విషయంలోనూ తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా టైటానిక్‌ శకలాలను చూడటానికి చాలా కంపెనీలు ప్రయత్నించాయి కానీ సఫలం కాలేకపోయాయి. ఈసారి యాత్రకు వెళ్లినవారు గతంలో సాహసయాత్రలు చేసినవారే. అందుకే సురక్షితంగా బయటకు వస్తారని అనుకున్నారంతా!

Updated On 22 Jun 2023 11:29 PM GMT
Ehatv

Ehatv

Next Story