మనం సాధారణంగా వరిపై ఉన్న పొట్టును తీసేసి లోపల ఉన్న బియ్యాన్ని వండుకొని తింటాం.

మనం సాధారణంగా వరిపై ఉన్న పొట్టును తీసేసి లోపల ఉన్న బియ్యాన్ని వండుకొని తింటాం. తవుడును మాత్రం పశువులకు దాణాగా వేస్తాం. ఆ తవుడు(Rice Bran)ను తినే పశువులు ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మనం పాలిష్ చేసిన బియ్యాన్ని తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతి వైద్య నిపుణులు మనం తవుడును కూడా తినవచ్చని చెబుతున్నారు. తవుడును నేరుగా తినలేకున్నా దాంతో టీ డికాషన్ తయారు చేసి తాగవచ్చు. మీరు తినే ఆహారాలపై కాస్త చల్లి తినవచ్చు. ఎన్నో పోషకాలకు నెలవుగా ఉండే తవుడును తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. తవుడులో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో ఫెరూలిక్ యాసిడ్(Ferulic acid), పి-కౌమారిక్ యాసిడ్ (P-Coumaric Acid)ఉండడంతో ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఫ్రీర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారించి క్యాన్సర్(Cancer), గుండెపోటు (Heart Attack) వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తవుడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు(Joint pain), వాపులు తగ్గుతాయి. తవుడును తినడం వల్ల శరీరంలోని అనేక కణాలు ఉత్తేజితం అవుతాయి. ఇవి రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. తవుడులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపర్చుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్లో ఉండే మలం సులభంగా కదులుతుంది.మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. కనుక తవుడును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక దీన్ని తింటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండె జబ్బులను నివారిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి.గుండె పోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. తవుడు వల్ల షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవచ్చు. క్యాన్సర్ కణాలు పెరగవు. అధిక బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో లాభాలు దీని వల్ల ఉంటాయి. ఇందుకే తవుడును కచ్చితంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
