దీపావళి(Diwali) వచ్చేస్తోంది. మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

దీపావళి(Diwali) వచ్చేస్తోంది. మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వెలుగుల పండుగ కోసం యావత్‌ భారతం ఎదురుచూస్తున్నది. దీపావళి వేడుకలలో భాగంగానే మనం జరుపుకునే పండుగ ధన త్రయోదశి(Thrayodashi). ధన్‌తేరాస్‌ అని ఉత్తరాదివారు అంటారు. అయిదు రోజుల దీపావళి పండుగ ధన త్రయోదశినే నాంది.

ఈ పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొంత మంది యమదీపం వెలిగించి ఇంటి ముందుంచుతారు. ఇంకొంత మంది బంగారం వెండి వస్తువులు కొంటారు. మరికొందరు లక్ష్మీపూజ చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 29వ తేదీన ధన త్రయోదశి పండుగ వస్తున్నది.

త్రయోదశి రోజున చీకట్లు ముసురుతున్న వేళ అపమృత్యు నివారణ కోసం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, దాన్ని పూజించి ఇంటిముందుంచుతారు. ఇదే యమదీపం. ఈ దీపోత్సవాన్ని కౌముదీ మహోత్సవం అని కూడా అంటారు. నరక చతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేస్తే పుణ్యలోకాలు సంప్రప్తాయన్నది ఓ విశ్వాసం. ఈ రోజు బంగారం వెండి వస్తువులు కొటారు. వివిధ ఆభరణాలతో లక్ష్మీదేవిని(Lakshmi Pooja) అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గడపదాటి వెళ్లిపోదనేది హిందువుల నమ్మకం. ఉత్తర భారతంలో ఈ ఆచారం ఇప్పటికీ వుంది. ధన్‌తేరస్‌ పేరిట ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా వారు భావిస్తారు.

అసలు ధన త్రయోదశి నుంచే ఇంటి ముందు దీపాల్ని(Lights) వెలిగించడం మొదలవుతుంది. ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకూ కొనసాగుతుంది. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారని ఉత్తర భారతీయులు నమ్ముతారు. అందుకే సాయంకాలం ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని వుంచుతారు. పితృదేవతలకు ఈ దీపమే దారి చూపుతుందని వారి విశ్వాసం. దక్షిణ భారతంలో ధన త్రయోదశిని ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకుంటారు. దీనికి సంబంధించి ఎన్నో పురాణగాధలున్నాయి. నరకాసురుడి చేతిలో బందీగా వున్న ధనలక్ష్మీని శ్రీమహా విష్ణువు విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మీకి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన రోజు ఇదే! బలిచక్రవర్తికి వామనావతారంలో వున్న విష్ణుమూర్తి వరమిచ్చిన రోజు కూడా ఇదే! తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా వుండాలని ఆ లక్ష్మీపతిని బలిచక్రవర్తి ప్రార్థిస్తాడు. ఆ మహాభక్తుడి కోరిక మేరకు దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశి నాడు శ్రీహరి వర ప్రదానం చేశాడు...అందుకే ఈ పండుగకు అంత వెలుగు..

ఈ పండుగకు సంబంధించిన మరో కథ కూడా వుంది. సంతానం కోసం పరితపిస్తున్న హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుడతాడు. ఆ రాజకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాముకాటుతో చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు. వాళ్లు చెప్పినట్టే పదహారోఏట వివాహమవుతుంది. ఆ రాజకుమారుడి భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు రాజసౌధాన్ని దీపాలతో అలంకరిస్తుంది.. బంగారం, వెండి, రత్నాలను రాశులుగా పోసి శ్రీహరి వైభవాన్ని గానం చేస్తుంది.. రాజకుమారుడి ప్రాణాలు తీయడానికి సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజుకు ఆ దీపకాంతికి, బంగారం వెండి ధగధగలకు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మర్చిపోతాడు. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధన త్రయోదశి ఓ సూచిక. అందుకే ఈ రోజున వెండి బంగారాలను కొని ధనలక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఇదంతా ఉత్తర భారత దేశంలో ప్రాచుర్యమైన పురాణకథలు. ఇక్కడి వాళ్లకు పెద్దగా సంబంధం లేదు.

క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కుబేరుడు ఉద్భవించారని అంటారు. అందుకే ధన త్రయోదశి రోజున ఇద్దరినీ పూజిస్తారు. అలాగే దేవతలు, రాక్షసులు అమృతంతో సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ధన్వంతరి ఉద్భవించాడు. అందుకే ఈ పండుగను ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఎంతో శుభప్రదమైన ధంతేరాస్‌ రోజున బంగారం లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. ఇప్పుడు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా కొంటున్నారు. షాపులు ధంతేరాస్‌ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయి. బంగారం, వెండి ధరలు చుక్కలకు చేరినప్పటికీ వినియోగదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే బంగారం షాపుకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నమ్మకమైన షాపులో మాత్రమే బంగారు, డైమండ్‌ నగలను కొనండి. హాల్‌మార్క్‌ను పరిశీలించండి. నగలపై హాల్‌మార్క్‌ లేకపోతే కొనకండి. తూకం సరిగ్గా ఉందో లేదో చెక్‌ చేసుకోండి. మిల్లీ గ్రామ్‌ తక్కువైనా నష్టపోయినట్టే కదా

Updated On 25 Oct 2024 2:00 PM GMT
Eha Tv

Eha Tv

Next Story