పవిత్ర రంజాన్(Ramzan 2023) మాసం ప్రారంభమయ్యింది. మసీదు( Masjid)లు కొత్త కళను సంతరించుకున్నాయి. విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతున్నాయి. ఈ సందర్భంగా భారత్లో వెలిసిన మొట్టమొదటి మసీదు గురించి తెలుసుకుందాం! ఇస్లాం మతం(Islam) పుట్టిన తొలినాళ్లలోనే భారత్లో అడుగుపెట్టింది.

Cheraman Juma Masjid
పవిత్ర రంజాన్(Ramzan 2023) మాసం ప్రారంభమయ్యింది. మసీదు( Masjid)లు కొత్త కళను సంతరించుకున్నాయి. విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతున్నాయి. ఈ సందర్భంగా భారత్లో వెలిసిన మొట్టమొదటి మసీదు గురించి తెలుసుకుందాం! ఇస్లాం మతం(Islam) పుట్టిన తొలినాళ్లలోనే భారత్లో అడుగుపెట్టింది. 14 వందల ఏళ్ల కిందటే భారత్లో మసీదు వెలిసిందంటే ఆశ్చర్యమనిపిస్తుంది. అసలు ప్రపంచంలో అత్యంత పురాతనమైన మసీదుల లిస్టు తీస్తే భారత్లో ఉన్న మసీదు రెండో స్థానంలో ఉంటుంది. అంత పాతదన్న మాట! సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల కిందటే భారత్లో ఓ మసీదు నిర్మితమయ్యింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మసీదులలో ఇది రెండోది. ఆ లెక్కన ఎంత ప్రాచీనమైనదో అర్థమవుతుంది. కేరళ(Kerala)లోని త్రిసూర్ జిల్లా(Thrissur district)లో కొడంగళూరు అనే చిన్న పట్టణం ఉంది. మలబార్ తీరం(Malabar Coast)లో ఉన్న ఈ ప్రార్థనమందిరం పేరు చేరామన్ జమా మసీదు(Cheraman Juma Masjid). క్రీస్తుశకం 629లో నిర్మించిన ఈ మసీదు భారతదేశంలోనే మొట్టమొదటిది! మాలిక్ బిన్ దీనార్(Malik Bin Dinar) ఈ మసీదు నిర్మాణకర్త..
ఈ ప్రార్థనమందిర నిర్మాణంపై హిందూమత ప్రభావం కనిపించడం విశేషం. కొన్ని వందల ఏళ్లుగా ఈ మసీదులోని దీపం అఖండంగా వెలుగుతూ ఉంది. క్రీస్తుశకం 1341లో వచ్చిన వరద ఈ మసీదును చాలా వరకు ధ్వంసం చేసిందట! అటు పిమ్మట ఈ మసీదును పునర్నిర్మించారు. ఫలానా మతంవారే మసీదులోకి రావాలన్న రూలేమీ లేదు. ఎవరైనా వెళ్లొచ్చు. దీపాన్ని వెలిగించవచ్చు. ఇస్లాం పుట్టిన కొత్తల్లోనే మలబార్ ప్రాంత రాజు చేరామన్ పెరుమాళ్(Cheraman Perumal) ఆ మతాన్ని స్వీకరించారట. మక్కా(Mecca)ను కూడా సందర్శించి మహ్మద్ ప్రవక్తను కలుసుకున్నాడట! చేరామన్ పెరుమాళ్కు అక్కడ మల్కిబిన్ దీనార్. మల్కిబిన్ హబీబ్లు పరిచయమయ్యారు! వారిని కేరళకు ఆహ్వానించి కేరళలో ఇస్లాం మత అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరారు.
చేరామన్ ఆహ్వానం మేరకు క్రీస్తుశకం 629లో వారు కేరళకు వచ్చి చేరామన్ జుమా మసీదును నిర్మించారని చెబుతుంటారు. గతంలో ఇది బౌద్ధ ఆరామమని, బౌద్ధులు ఈ మందిరాన్ని అరబ్బులకు కానుకగా ఇచ్చారని ఆ తర్వాతే ఇది మసీదుగా మారిందని కొందరంటుంటారు.. ఈ ప్రాచీన మసీదును సందర్శించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మసీదులోని దీపపు ఇత్తడి సెమ్మలను చూస్తే ఇది గుడా ..? మసీదా..? అన్న అనుమానం కలగకుండా మానదు! ఇక మసీదులోపల అద్భుతమైన నగిషీలతో ఉన్న వేదిక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పూర్తిగా రోజ్వుడ్తో ఈ వేదికను నిర్మించారు. ఇందులో ఉన్న పాలరాయి ముక్కను మక్కా నుంచి తెచ్చారట! పవిత్ర రంజాన్ మాసంలో ఈ మసీదు కొత్త అందాలను సంతరించుకుంటుంది.. సందర్శకుల తాకిడి కూడా పెరుగుతుంది..
