గోపాలుడికి ఎన్ని దివ్య క్షేత్రాలు ఉన్నా కర్నాటకలోని ఉడిపి ఆలయం(Udipi temple) ఎంతో ప్రత్యేకం

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం అవతరించిన పరంధాముడే శ్రీకృష్ణుడు(Krishna) .. ఆ మనోహర మోహనరూపానికి ఎవరైనా ముగ్ధలవ్వాల్సిందే.. గోపాలుడికి ఎన్ని దివ్య క్షేత్రాలు ఉన్నా కర్నాటకలోని ఉడిపి ఆలయం(Udipi temple) ఎంతో ప్రత్యేకం.. అసలు కృష్ణాలయం అనగానే టక్కుమని గుర్తుకొచ్చేది ఉడిపినే! శ్రీకృష్ణాలయాల్లో అత్యంత అద్భుతమైనది.. సుప్రసిద్ధమైనది ఉడిపి దేవాలయం.. కర్నాటకలోని మంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యమందిరం. పూర్వం ఈ ప్రాంతాన్ని శివళ్లి అని పిలిచేవారు. ఈ ఆలయంలోని కృష్ణభగవానుడి విగ్రహాన్ని సుమారు 800 ఏళ్ల కిందట ద్వైతమత స్థాపకులు మధ్వాచార్యులు ప్రతిష్టించారని ప్రతీతి..నలుపురంగు సాలిగ్రామ శిలతో తయారుచేసిన ఇక్కడి కృష్ణ విగ్రహం నయనానందకరంగా ఉంటుంది ప్రతిరోజూ వేకువ జామునే ఆలయద్వారాలు తెరచుకుంటాయి.. ఉదయం పూజలు కన్నుల పండుగగా జరుపుతారు. ఇక కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణమే దివ్యానుభూతిని కలిగిస్తుంది.. స్వాగతద్వారం నుంచే కృష్ణనామం వినిపిస్తుంటుంది.. దేవతామూర్తులతో వర్ణశోభితమైన ప్రధానద్వారం నుంచి వెళ్లగానే.. ముందు లక్ష్మీదేవి దర్శనమిస్తుంది.. ఆ తర్వాత ఆదిశేషుడి తలపైన అభయముద్రలో శ్రీకృష్ణపరమాత్ముడు కనిపిస్తాడు.. ఇరువైపులా జ్యోతులతో కూడిన హనుమంతుడు.. గరుత్మంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి.. ఈ ఆలయంలో మనకు శైవ చిత్రాలు కూడా గోచరమిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళితే వెండితో తాపడం చేసిన నవరంధ్రాల గవాక్షం వస్తుంది.. కృష్ణభగవానుడిని నేరుగా కాకుండా ఈ కిటికీ ద్వారానే దర్శించుకోవాలి.. మానవ శరీరంలోని నవరంధ్రాలకు ఈ కిటికీ ప్రతీక అని అంటారు. ఇక ఉడిపిలో నెలవైన బాలకృష్ణుడి దివ్యమంగళరూపాన్ని చూసేందుకు వేయి కళ్లయినా చాలవు. పూర్వం వాదిరాజు పాలనలో కనకదాసుడని భక్తుడుండేవాడు.. ఉడిపిలోని కృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్లాడు.. అయితే పూజారులు ఆయనను గుడిలోకి అనుమతించలేదు.. అప్పుడు కృష్ణుడు భక్తుడిని అనుగ్రహిస్తాడు. తన విగ్రహం వెనుకవైపున గోడకు కన్నం ఏర్పాటు చేసి వెనక్కు తిరుగుతాడు.. ఆ కన్నం గుండా కనకదాసుకు దర్శనమిస్తాడు.. అప్పటి నుంచి ఈ కిటికీకి కనకనకిండి అనే పేరు వచ్చింది. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండపాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయమంతా కృష్ణభగవానుడి లీలలను వివరించే తైలవర్ణచిత్రాలు దర్శనమిస్తాయి.. ఉడిపిలో ప్రతిరోజూ రథోత్సవం, తెప్పొత్సవం జరగటం విశేషం. ఇక రోజులో పలుమార్లు వివిధ రకాల వాయిద్యాల మంగళస్వరాలతో స్వామి వారికి హారతి ఇస్తారు.

Updated On 25 Aug 2024 4:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story