అత్తారింటి వద్ద భార్యను దించేసి.. వెళుతున్న యువకుడి జీవితంలో

అత్తారింటి వద్ద భార్యను దించేసి.. వెళుతున్న యువకుడి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బుర్హాన్ పురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు, ద్విచక్ర వాహనం బుర్హాన్ పురం సబ్ స్టేషన్ వద్ద ఎదురెదురుగా 'ఢీ' కొట్టుకున్న దుర్ఘటనలో యువకుడు మరణించాడు. చనిపోయిన వ్యక్తిని బాదావత్ శంకర్(28) గా గుర్తించాడు. మృతుడు గుండెపుడి గ్రామ వాసిగా గుర్తించారు. తానంచర్ల గ్రామంలో ఆదివారం బొడ్రాయి పండుగ సందర్భంగా తన భార్యని పుట్టింటి వద్ద దించి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో మినీలారీ, కావేరి ట్రావెల్స్ బస్సుని ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఇద్దరు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. తీవ్రగాయాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Updated On 10 Feb 2024 2:53 AM GMT
Yagnik

Yagnik

Next Story