ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 23 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన కొన్ని గంటల తర్వాత అతడు తన తనువు చాలించాడని పోలీసు అధికారులు తెలిపారు. బాధితుడికి సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరికి పరిచయం అయింది.. ఆ పరిచయమే ఇంతటి దారుణానికి కారణమైందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. బాధితుడికి కరణ్ (అలియాస్ అశుతోష్ మిశ్రా)తో నెల రోజుల క్రితం ఆన్‌లైన్‌లో స్నేహం మొదలైంది. ఆ తర్వాత కరణ్‌ బాధితుడిని చిలువాటల్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. గురువారం నాడు కరణ్ బాధితుడిని రైల్ విహార్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. అతడితో మరో ముగ్గురు సహచరులు చేరారు. నలుగురు వ్యక్తులు కలిసి బాధితుడిని బంధించారు. ఆ తర్వాత లైంగికంగా వేధించారు, బెల్టుతో కొట్టారు. ఈ ఘటనను మొత్తం రికార్డ్ చేసి, డబ్బు చెల్లించకపోతే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారు.

నిందితులు బాధితుడి ఫోన్‌ లో యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసి బీరు కొనుగోలు చేశారని ఎస్పీ శ్రీవాస్తవ తెలిపారు. బాధితుడు షాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది, అయితే ఎఫ్‌ఐఆర్ వెంటనే నమోదు కాలేదు. అసహజ నేరాలు, దోపిడీ, నేరపూరిత బెదిరింపు, ఇతర సంబంధిత ఆరోపణలకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఎట్టకేలకు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదేరోజు రాత్రి బాధితుడు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల్లో కరణ్ అలియాస్ అశుతోష్ మిశ్రా (26), దేవేష్ రాజ్‌నంద్ (24), అంగద్ కుమార్ (21)లను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో నిందితుడు మోహన్ ప్రజాపతి (20)ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


Eha Tv

Eha Tv

Next Story