ఆమెను కాపాడేందుకు వెళ్లిన మృతురాలి తోడికోడలు తల్లి లక్ష్మిపై కూడా నూకరాజు కత్తితో దాడి చేయగా ఆమె చేతికి

కాకినాడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఎవరెన్ని చెప్పినా విననంటూ భార్య మీద పెంచుకున్న అనుమానం ఆమెను రోడ్డు మీదనే హత్య చేసేలా చేసింది. అది కూడా పెళ్లి రోజు నాడే ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. బందుల నూకరాజు చేతిలో దివ్య హతమైంది. బందుల నూకరాజుకు దివ్యకు ఎనిమిదేళ్ల క్రితం 2016 ఫిబ్రవరి 29న పెళ్లి అయింది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్లకు పెళ్లిరోజునాడే ఈ దారుణం జరిగింది.

నూకరాజు కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతంలో ఉండేవాడు. దివ్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. లీపు సంవత్సరం కావడంతో నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29న వచ్చిన వివాహ వార్షికోత్సవం రోజున భార్యతో హాయిగా గడపకుండా వాగ్వాదానికి దిగాడు. చివరికి కత్తితో నడిరోడ్డుపై భార్యను పొడిచేశాడు. నూకరాజు దివ్యను ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడని.. ఆ అనుమానం పెంచుకునే చివరికి ఈ హత్యకు ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకు ముందు కూడా గొడవలు జరిగాయి.. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు ఇద్దరికీ సర్ది చెప్పారు. అయినా కూడా నూకరాజు అనుమానంతో దివ్యను వేధిస్తూనే ఉండేవాడు. నూకరాజు పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు దివ్యను అనుమానంతో కొట్టేవాడు కూడా అని స్థానికులు తెలిపారు.

గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. పెద్దగా కేకలు వినిపించినా వాళ్ళింట్లో ఇవి మామూలే కదా అనుకుని సమీపంలో ఉన్న బంధువులు, స్థానికులు గొడవ విషయాన్ని పట్టించుకోలేదు. నూకరాజుతో మరోసారి గొడవ పడిన దివ్య ఇంటి నుండి బయటకు వచ్చేసింది. నూకరాజు కూడా పదునైన కత్తి తీసుకుని బయటకు వచ్చాడు. ఆమెపై దాడికి తెగబడ్డాడు. మెడపై తీవ్ర గాయమై దివ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన మృతురాలి బంధువులు కూడా గాయపడ్డారు. నూకరాజు దాడిలో దివ్య బంధువు లక్ష్మి చేతికి గాయాలయ్యాయి. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో.. అక్కడికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. అనుమానం, క్షణికావేశం చివరికి ఓ జంట జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసాయి. ఇద్దరు పిల్లలను అనాధ చేశాయి.

Updated On 1 March 2024 1:03 AM GMT
Yagnik

Yagnik

Next Story