కడప జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ కంటైనర్, కారు ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది

కడప జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ కంటైనర్, కారు ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. రాయచోటి నుండి కడప వైపు లారీ కంటైనర్ వస్తుండగా.. కడప నుండి రాయచోటి వైపుకు కారు వెళ్తుంది. వాహ‌నాలు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారును ఢీకొట్టిన కంటైనర్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స‌హా కంటైనర్ డ్రైవర్ మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారిని గుజ్జుగారి నాగయ్య (46), వల్లెపు చిన్న వెంకటమ్మ (50), వల్లెపు నాగలక్ష్మి దేవి (35), కారు డ్రైవర్ కమ్ ఓనర్ ఖాడమియ్యా గారి షరీఫ్ (38)గా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ వివ‌రాలు తెలియాల్సివుంది. వెంకటమ్మ బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు చక్రాయపేట మండలం కొండగరు పల్లె గ్రామం వడ్డేపల్లికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story