ఆహ్వానితులతో పెళ్లిమండపం సందడిగా ఉంది.

ఆహ్వానితులతో పెళ్లిమండపం సందడిగా ఉంది. వధూవరుల తల్లిదండ్రులు వచ్చిన బంధుమిత్రులను పలకరిస్తున్నారు. కాసేపట్లో పెళ్లి .. అందులోనే ఓ యువతి మండపంలోకి దూసుకొచ్చింది. తనకు అన్యాయం చేసి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ తన వెంట తెచ్చుకున్న కత్తి(Knife), యాసిడ్‌తో(Acid) బీభత్సం సృష్టించింది. పెళ్లి మండపం ఒక్కసారిగా రణరంగంగా మారింది. అరుపులు, కేకలతో హాల్‌ మారుమోగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా(Annamaiah District) నందలూరులో(Nandaluru) జరిగింది. వివరాల్లోకి వెళితే రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా తిరుపతికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పదేళ్లుగా వారి బంధం కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా సయ్యద్‌ బాషా ఆ యువతి దగ్గరకు వెళ్లడం లేదు. ఆమెకు అనుమానం వచ్చి అతడిని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చింది. అతడి గురించి ఆరా తీసింది. నందలూరులో బాషా పెళ్లి జరగబోతున్నదని తెలుసుకుని ఆగ్రహించింది. పెళ్లి జరిగే హాల్‌కు వెళ్లింది. తనవెంట యాసిడ్‌, కత్తిని తీసుకెళ్లింది. వాటితో బాషాపై దాడికి దిగింది. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో చిన్నపాటి తోపులాట జరిగింది. వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ మొహంపై యాసిడ్‌ పడింది. దాంతో బాష కత్తిని తీసుకుని ప్రియురాలు వీపు, భుజంపై పొడిచాడు. ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళలను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ వధువు తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వరుడి ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను ఓ గదిలో ఉంచారు.

Eha Tv

Eha Tv

Next Story