గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో టీడీపీ బలహీనంగా ఉండడం వల్లే బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని.. చంద్రబాబు, టీడీపీ బలహీనత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ పర్యటన ఒక నిదర్శనం అని అన్నారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతుంటే... చంద్రబాబుతోనే పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ఫేక్ ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని అన్నారు. టీడీపీ గతంలోనూ ఇలాగే పొత్తుల కోసం ప్రయత్నాలు చేసిందని, బలం ఉంటే ఒకరితో పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని అన్నారు సజ్జల. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెంటిలేటర్ పై ఉన్న పార్టీని బలంగా చూపించడం కోసం తీవ్రనిరాశ నిస్పృహలతో చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోందని సజ్జల విమర్శలు గుప్పించారు.

తెలుగుదేశం, జనసేన ఇంకా తోకపార్టీలన్నీ కలిసి వచ్చినా తమకేం ఇబ్బంది లేదన్నారు వైసీపీ నేత రోజా సెల్వమణి. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని అన్నారు రోజా. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బలంగా చెప్పారు రోజా.

Updated On 8 Feb 2024 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story