మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీని వీడారు. తన‌ రాజీనామా లేఖ‌ను

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీని వీడారు. తన‌ రాజీనామా లేఖ‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపించారు. తాను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు కట్టుబడి పనిచేశాన‌ని.. 2014లో త‌న‌కు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు చంద్రబాబు అవకాశం కల్పించారన్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ కొన్ని కార‌ణాల‌తో టీడీపీలో కొన‌సాగ‌లేక‌పోయినందుకు ఎప్పుడూ బాధ‌ప‌డుతూనే ఉంటాన‌ని తెలిపారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేద‌న్నారు. ఇక వైఎస్ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరిన‌ట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయ‌న‌ను తిరస్కరించారన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. మంద కృష్ణమాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు ఆ అంశం ముగింపున‌కు వచ్చిందని భావిస్తున్నాన‌ని రావెల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దతు తెలిపారని, అందుకే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని స్పష్టం చేశారు.

2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు.

Updated On 7 Jun 2024 3:37 AM GMT
Yagnik

Yagnik

Next Story