రుమలలో(tirumala) రథసప్తమి(ratha sapthami) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్ప స్వామి(malayappa swamy

తిరుమలలో(tirumala) రథసప్తమి(ratha sapthami) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్ప స్వామి(malayappa swamy). స‌ప్త వాహనాలపై స్వామి వారి వైభ‌వాన్ని తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేయ‌నుండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది.శ్రీ‌వారి ఆల‌యంలో తెల్ల‌వారుజామున కైంక‌ర్యాలు పూర్త‌యిన త‌రువాత ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం నుండి వాహన మండపానికి వేంచేపు చేశారు. అక్క‌డ విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌ సేవ మొద‌ల‌య్యింది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలి కిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి వారి పాదాల‌ను స్ప‌ర్శించాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేసింది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్త కోటికి సిద్ధిస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఉదయం 11 గంటల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు స్వామివారు గ‌రుడ వాహనంపై విహరిస్తారు. శ్రీ‌వారికి అత్యంత ప్రీతి పాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామి వారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామి వారు భక్త కోటికి తెలియజెప్పు తున్నాడు. మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాల తత్త్వం ఒనగూరుతుంది. మ‌ధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.శ్రీ‌ వ‌రాహ‌ స్వామి వారి ఆలయం వ‌ద్ద గ‌ల స్వామి పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు.

శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్వామివారు సర్వ భూపాల వాహనంలో ఊరేగుతారు. సర్వ భూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామి వారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామి వారు అందిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంలో స్వామి దర్శనమిస్తారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనంద రసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

Updated On 16 Feb 2024 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story